
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. మరోసారి కరీంనగర్ సీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. సీపీకి జల్సాలు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. ప్రైవేటు వ్యక్తులకు ఆయుధాలు ఇచ్చి కరీంనగర్ సీపీ కాల్పులు జరిపిస్తున్నారని పేర్కొన్నారు. ప్రైవేటు వ్యక్తులకు ఏకే-47, పిస్టల్స్, బుల్లెట్లు ఎలా ఇచ్చి కాల్చేలా చేస్తారని ప్రశ్నించారు. ఇప్పటికే సీపీ లీలలకు సంబంధించి ఫోటోలు, వీడియోలు బయటపెడతానని కౌశిక్ రెడ్డి తీవ్ర హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే.
తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన కౌశిక్ రెడ్డి.. పోలీస్ ఉన్నతాధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. కరీంనగర్ సీపీకి జల్సాలు ఎక్కువ అయ్యాయని.. చట్టాన్ని రక్షించేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఆయుధాలను.. ఆయన ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి కాల్పులు జరిపిస్తున్నారని సంచలన ఆరోపణలకు తెర తీశారు.
గతేడాది సెప్టెంబర్ నెలలో కరీంనగర్ ఫైరింగ్ రేంజ్లో సీపీ గౌస్ ఆలం భార్య, ఆమె ఐదుగురు ఫ్రెండ్స్ కలిసి 10 రౌండ్లు కాల్పులు జరిపినట్లు కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఏకే-47, తుపాకులతో సుమారు 160 బుల్లెట్లను కాల్చారని.. అయితే ప్రైవేట్ వ్యక్తులు వీటిని ఎలా ఉపయోగిస్తారని ఆయన నిలదీశారు. ఈ కాల్పుల్లో బోనాలపల్లిలో అమృతమ్మ అనే వృద్ధురాలికి బుల్లెట్ గాయం అయినట్లు పేర్కొన్న కౌశిక్ రెడ్డి.. అది తెలియక ఆమె రాయి తగిలిందని భావించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఈ విషయం బయటికి పొక్కకుండా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

