
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతన్నల సేవలో కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో పర్యటించారు. సూర్యలంక, చీరాల బీచ్లను అభివృద్ధి చేస్తామన్న చంద్రబాబు.. మరిన్ని మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. సూర్యలంక నుంచి చీరాల వరకు బీచ్ కారిడార్గా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. సూర్య లంకకు వైభవం తీసుకొస్తామని.. చీరాలకు విమానాశ్రయం తీసుకొస్తామని చెప్పుకొచ్చారు. ఇటీవల కాలంలో సూర్యలంకకు పర్యాటకుల తాకిడి పెరిగిందన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఎయిర్పోర్ట్లను ప్లాన్ చేస్తోంది.. ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు కూడా పంపింది. ఒకటి రెండు, చోట్ల భూసేకరణకు కసరత్తు జరుగుతోంది. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కొత్త ఎయిర్పోర్ట్పై ప్రకటన చేశారు. వీకెండ్ వస్తే హైదరాబాద్ ఖాళీ అవుతోందని.. సూర్యలంక, చీరాల బీచ్కు ఎక్కువమంది వస్తున్నారని చెప్పుకొచ్చారు చంద్రబాబు. బాపట్ల జిల్లా జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని వేటపాలెం మండలం కొత్తపేటలో నిర్వహించిన నేతన్నల సేవలో కార్యక్రమాన్ని ప్రారంభించిన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
సూర్యలంక బీచ్కు తూర్పు తీర ఆంధ్రా గోవాగా వైభవం తీసుకొస్తామన్నారు చంద్రబాబు. ఇప్పటికే రూ.97.52 కోట్లతో స్వదేశీ దర్శన్ కింద అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. బాపట్ల జిల్లా సూర్యలంక నుంచి చీరాల వరకు 18 కి.మీ. తీర ప్రాంతాన్ని బీచ్ కారిడార్గా తీర్చిదిద్దుతామన్నారు. సూర్యలంక బీచ్కు హైదరాబాద్, బెంగళూరు నుంచి పర్యాటకులు వచ్చేలా వరల్డ్ క్లాస్ సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అంతేకాదు చీరాల సమీపంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలోనే ఆలోచన ఉందన్నారు. అప్పుడు ప్రపంచ నలుమూలల నుంచి ఇక్కడికి పర్యాటకులు వచ్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. సూర్యలంక, చీరాల తీర ప్రాంతంలో లెమన్ ట్రీ, నోవాటెల్ స్టార్ హోటళ్లు ఏర్పాటు కానున్నాయి. ఈ హోటల్స్ శంకుస్థాపనకు రావాలని సీఎం చంద్రబాబును బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్కుమార్ ఆహ్వానించారు.
మరోవైపు చీరాల పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు చీరాల మండలం రామకృష్ణాపురానికి చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు కొమ్మాలపాటి పుష్పావతిని కలిశారు. ఆమె చంద్రబాబును చూడాలని ఉందని సోషల్ మీడియాలో వీడియో షేర్ చేయడంతో ముఖ్యమంత్రి స్పందించారు.. కచ్చితంగా కలుస్తానని హామీ ఇచ్చారు. చీరాలలో పుష్పావతిని కలిసి యోగ క్షేమాలు ఆరా తీశారు. చంద్రబాబుని కలవడంతో తన జీవితకాల కోరిక నెరవేరిందన్నారు పుస్పావతి. ఇటు శ్రీకాకుళం జిల్లా లావేరు మండల కేంద్రం పెద్దవీధికి చెందిన చేనేత కార్మికులు బాసిన నాగేశ్వరరావు, లక్ష్మి దంపతులు ముఖ్యమంత్రి చంద్రబాబును చీరాలలో కలిశారు. చంద్రబాబుపై అభిమానంతో నెల రోజుల పాటు కష్టపడి చేనేత వస్త్రంపై చంద్రబాబు ముఖచిత్రాన్ని మగ్గంపై తయారు చేశారు. ముఖ్యమంత్రికి చేనేత వస్త్రం, శాలువాను దంపతులు బహూకరించారు.

