
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో శ్రీవారి భక్తులకు కల్పించాల్సిన ఉత్తర ద్వార దర్శనాలపై తిరుమల తిరుపతి దేవస్థానం పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. దీనికోసం ఇటీవలే టీటీడీ పాలక మండలి అత్యవసరంగా సమావేశమైంది కూడా.
డిసెంబర్ 30 నుండి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలను కల్పించాలని నిర్ణయించింది. ఉత్తర ద్వార దర్శనంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తీర్మానించింది. వైకుంఠ ద్వారం ఏర్పాటైన మొదటి మూడు రోజులు 300 రూపాయలు, శ్రీవాణి కోటా టికెట్ల దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.
జనవరి 2 వ తేది నుండి 8వ తేది వరకు రోజుకు రూ.300 దర్శన టిక్కెట్లు- 15,000, శ్రీవాణి దర్శన టికెట్లు- 1,000 రెగ్యూలర్ పద్ధతిలో టీటీడీ మంజూరు చేయనుంది. ఇందులో కూడా మొదటి మూడు రోజులకు ఈ- డిప్ ద్వారా టికెట్ల కేటాయింపు ఉంటుంది. ఈ నెల 27 నుండి డిసెంబర్ 1వ తేది వరకు దర్శన టోకెన్ల రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పించింది. డిసెంబర్ 2వ తేదీన డిప్ ద్వారా ఎంపికైన వారికి టోకెన్లను కేటాయిస్తారు.
టీటీడీ వెబ్ సైట్, యాప్, వాట్సాప్ ద్వారా పారదర్శకంగా టోకెన్ల జారీ, రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉంటుంది. జనవరి 6, 7, 8 తేదీల్లో తిరుమల, తిరుపతి స్థానికులకు రోజుకు 5,000 టోకెన్లు మంజూరు చేస్తుంది టీటీడీ. ఆన్ లైన్ లో ముందు బుక్ చేసుకున్న వారికి ముందు ప్రాతిపదికన టోకెన్లు అందుతాయి. 10 రోజుల పాటు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా మిగిలిన అన్ని రకాల ప్రివిలేజ్ దర్శనాలు రద్దయ్యాయి.
