
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత దక్కింది. సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకంతో చట్టరూపం దాల్చింది.. ఆ వెంటనే కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2024 జూన్ 2 నుంచి అమరావతికి రాష్ట్ర రాజధాని హోదాను కల్పిస్తూ గెజిట్ నోటిఫికేషన్లో పొందుపరిచారు. అయితే 2024 జూన్ 2 నుంచి అమరావతిని రాజధానిగా ఎందుకు నోటిఫై చేశారో తెలుసా!
ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష నెరవేరింది.. రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టపరమైన గుర్తింపు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ.. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014ను సవరిస్తూ తీసుకొచ్చిన బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేయగా.. న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2024 జూన్ 2 నుంచి 2 నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కేంద్రం నోటిఫై చేసింది. అమరావతి గెజిట్ నోటిఫికేషన్లో 2024 జూన్ 2 నుంచి రాజధానిగా గుర్తించినట్లు పేర్కొనడంపై చర్చ జరుగుతోంది. ఆ డేట్ను ఎందుకు ఎంచుకున్నారనే చర్చ మొదలైంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2014 నుంచి 2024 వరకు పదేళ్ల పాటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది. అయితే 2024 జూన్ 2తో ఆ గడువు ముగిసింది.. ఈ క్రమంలోనే జూన్ 2 2024 నుంచి అమరావతిని ఏపీ రాజధానిగా కేంద్రం నోటిఫై చేసింది. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అంశం, మూడు రాజధానుల ఎపిసోడ్కు చెక్ పెడుతూ జూన్ 2 2024 నుంచి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014ను సవరించగా.. సీఆర్డీఏ చట్టం కింద నోటిఫై చేసిన ప్రాంతాలు అమరావతికి వస్తాయని క్లారిటీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఎలాంటి వివాదాలు లేకుండా చట్టసవరణపై స్పష్టత ఇచ్చారు. ఒకవేళ భవిష్యత్లో రాజధాని అమరావతి ఏవైనా మార్పులు, చేర్పులు చేయాలంటే పార్లమెంట్కు మాత్రమే అధికారం ఉంటుదంటున్నారు. శాసనసభ చేసే సవరణకు చట్టబద్ధమైన విలువ ఉండదని చెబుతున్నారు.

