
రాయలసీమ, పరిసర ప్రాంతాలపై విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో సోమవారం, మంగళవారం రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీని ప్రభావంతో ఆయా రోజుల్లో ఎండ తీవ్రత స్వల్పంగా తగ్గే అవకాశం ఉందన్నారు. విభిన్న వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆకస్మికంగా ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు చెట్ల క్రింద, పొలాలు, బహిరంగ ప్రాంతాల్లో ఉండరాదని హెచ్చరించారు.
మరోవైపు సోమవారం(30-03-26) విజయనగరంజిల్లా బాడంగి,మెరకముడిదాం,తెర్లాం,వంగర మండలాలు.. పార్వతీపురంమన్యం జిల్లా బలిజిపేట, గరుగుబిల్లి, జియమ్మవలస, సీతానగరం మండలాలు.. పోలవరం జిల్లా చింతూరు, కూనవరం మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మంగళవారం 12 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.
ఆదివారం మార్కాపురం(జి)లో 13 ప్రాంతాల్లో, కడపలో 12, తిరుపతి 11, నెల్లూరు11, చిత్తూరులో 8 ప్రాంతాల్లో మిగతా చోట్ల కలిపి మొత్తం 78 చోట్ల 40°Cకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయిందని పేర్కొన్నారు.
ఆదివారం నెల్లూరు(జి) గూడూరు 42.4°C, మార్కాపురం(జి) నందనమారెల్ల 42.3°C, కృష్ణా(జి) పెద్దపారుపూడి 42.1°C, కడప(జి) పొట్టిపాడు 41.9°C, తిరుపతి(జి) నాగలాపురం, చిత్తూరు(జి) సింధురాజపురం 41.7°C, విజయనగరం(జి) రాజాం 41.2°C, పల్నాడు(జి) నూజెండ్ల, ప్రకాశం(జి) కొండపి, నంద్యాల(U) 40.8°C, తూర్పుగోదావరి(జి) చిట్యాల 40.4°C, కర్నూలు(జి)తోవి 40.2°C, శ్రీకాకుళం(జి) కొల్లువలసలో 40.1°C చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.

