
ఇరాన్ యుద్ధం ముదురుతున్న వేళ అమెరికా రక్షణ శాఖలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. అగ్రరాజ్య సైన్యాధిపతి జనరల్ ర్యాండీ జార్జ్ తన పదవి నుంచి తక్షణమే వైదొలిగారు. రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఆదేశాలతో జరిగిన ఈ మార్పు పెంటగాన్ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. కేవలం ఆర్మీ చీఫ్నే కాకుండా.. ఇప్పటికే డజను మందికి పైగా ఉన్నత స్థాయి జనరల్స్ను పక్కన పెట్టిన హెగ్సెత్.. రక్షణ విభాగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసే పనిలో పడ్డట్లు తెలుస్తోంది.
ఇరాన్తో యుద్ధం తీవ్రం అవుతున్న వేళ అమెరికా రక్షణ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటూ అంతర్జాతీయ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఆదేశ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తనదైన శైలిలో సాయుధ దళాల పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే తాజాగా అమెరికా సైన్యాధిపతి జనరల్ ర్యాండీ జార్జ్ను పదవి నుంచి వైదొలగాలని హెగ్సెత్ ఆదేశించగా.. ఆయన తక్షణమే బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని పెంటగాన్ వర్గాలు అధికారికంగా ధ్రువీకరించాయి.
పదాతిదళ అధికారిగా కెరియర్ ప్రారంభించిన ర్యాండీ జార్జ్.. ప్రఖ్యాత వెస్ట్పాయింట్ మిలిటరీ అకాడమీ నుంచి పట్టా పొందారు. ఆపై అమెరికా సైన్యంలో విశేష సేవలు అందించారు. గల్ఫ్ యుద్ధంతో పాటు ఇరాక్, అఫ్గానిస్థాన్ యుద్ధంలోనూ కీలక బాధ్యతలు నిర్వర్తించిన అనుభనం ఆయనకు ఉంది. గతంలో లాయిడ్ ఆస్టిన్ సహాయకుడిగా పని చేసిన ఆయన.. గతేడాది జరిగిన ఉన్నత స్థాయి అధికారుల తొలగింపుల నుంచి బయటపడగలిగారు. అయితే ప్రస్తుత రక్షణ మంత్రి హెగ్సెత్ చేపట్టిన మిలిటరీ ప్రక్షాళనలో భాగంగా ఇప్పుడు ఆయన కూడా పదవిని వదులుకోవాల్సి వచ్చింది. ర్యాండీ అకస్మాత్తుగా బాధ్యతల నుంచి తప్పుకోవడంతో.. అమెరికా సైన్యం ఆయన చేసిన సేవలను కొనియాడుతూ కృతజ్ఞతలు తెలుపుతూ ప్రకటన విడుదల చేసింది.

