
ఇప్ప పువ్వు గురించి మరోసారి కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 10 లక్షల ఇప్ప చెట్లను పెంచాలని.. సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఇక ఇప్ప చెట్ల పెంపకానికి సంబంధించి.. 52 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను సీఎం రేవంత్ రెడ్డికి పంపించారు. ఈ 52 మందిలో కాంగ్రెస్ సహా అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఉండటం గమనార్హం. దీంతో మరోసారి రాష్ట్రంలో ఇప్ప పువ్వు వ్యవహారం చర్చకు దారి తీస్తోంది.
కాంగ్రెస్ నేత, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి .. తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తెలంగాణలో 10 లక్షల ఇప్ప చెట్లు నాటాలని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంతకాల సేకరణ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే దీనికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి భారీగా మద్దతు లభిస్తుండటం విశేషం. ఏకంగా 52 మంది ఎమ్మెల్యేలు.. అనిరుధ్ రెడ్డి చేస్తున్న డిమాండ్కు మద్దతుగా సంతకాలు చేయడం గమనార్హం.
ఇప్ప పువ్వు ఉత్పత్తులను ప్రోత్సహించాలని పేర్కొంటున్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.. అవి ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెబుతున్నారు. ఇటీవల ఈ క్రమంలోనే ఇప్ప పువ్వు చెట్ల ఉద్యమాన్ని చెపట్టారు. రాష్ట్రంలో 10 లక్షల ఇప్ప చెట్లను నాటేలా చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ డిమాండ్కు ఇప్పటివరకు వివిధ పార్టీలకు చెందిన 52 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలపడంతో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.

