
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరించింది. వైద్య విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ బోధనాసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న 14 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ల్యాబ్ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్, డైటీషియన్, డార్క్రూమ్ అసిస్టెంట్ పోస్టుల్లో ఉన్న ఉద్యోగులకు ఈ క్రమబద్ధీకరణ వర్తిస్తుంది. 2024 ఏప్రిల్ 1 నుంచి రెగ్యులరైజేషన్ అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది. రెగ్యులర్ పోస్టుల్లో చేరిన తేదీ నుంచి ఆర్థిక ప్రయోజనాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.
ఇటీవల వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలోనూ 23 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ తదితర కేటగిరీల ఉద్యోగులకు ఈ అవకాశం కల్పించింది.
మరోవైపు.. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా మొదటి విడత కౌన్సెలింగ్లో 4,322 సీట్లు భర్తీ అయ్యాయి. ఎన్సీసీ, స్పోర్ట్స్ కోటా సీట్లను మినహాయించి ఈ సీట్లు కేటాయించినట్లు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెల్లడించింది.
