
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం సాకారం కానుంది. విజయనగరం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవం కోసం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు.
ప్రారంభోత్సవ ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, కె. అచ్చెన్నాయుడు, వంగాలపూడి అనిత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం చారిత్రాత్మక ఘట్టంగా నిలిచేలా ఏర్పాట్లు చేయనున్నారు.
ఈ కార్యక్రమం రాష్ట్ర సంస్కృతిని, కళా వారసత్వాన్ని ప్రతిబింభించేలా ఉండాలని, గిరిజన సంప్రదాయాలు, స్థానిక హస్తకళల ప్రదర్శనతో ఈ ప్రాంతపు ఉత్సాహాన్ని ప్రతిబింబించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. యువతను, విద్యార్థులను భాగస్వాములను చేస్తూ ఈ వేడుకను ఒక పండుగలా నిర్వహించాలని చంద్రబాబు సూచించారు.
2014లో టీడీపీ ప్రభుత్వ హయాంలో పురుడు పోసుకున్న ఈ ప్రాజెక్టును, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చి, యుద్ధ ప్రాతిపదికన రెండేళ్లలోనే పూర్తి చేసింది. నీటిపారుదల, రహదారులు, ఓడరేవులు వంటి మౌలిక సదుపాయాలతో పాటు ఇప్పుడు విమానాశ్రయం కూడా అందుబాటులోకి వస్తుండటంతో, ఉత్తరాంధ్ర అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ఆర్థిక స్వరూపాన్ని సమూలంగా మార్చే గేమ్ ఛేంజర్ కానుందని ముఖ్యమంత్రి ఎన్.
చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. హైదరాబాద్కు శంషాబాద్ విమానాశ్రయం ఏ విధంగా అయితే భారీ అభివృద్ధిని తీసుకువచ్చిందో, భోగాపురం విమానాశ్రయం కూడా ఉత్తరాంధ్రకు అదే స్థాయి అభివృద్ధి తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎయిర్ పోర్టు పర్యాటకం, పారిశ్రామికాభివృద్ధికి ఉత్ప్రేరకంగా పనిచేయడమే కాకుండా, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించి, సంపదను పెంపొందిస్తుందన్నారు.

