
కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను సవరించిన సంగతి తెలిసిందే. వీటిల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. తర్వాత పీఎఫ్ వడ్డీ రేటు కూడా 8.25 శాతం వద్ద యథాతథంగానే ఉంది. అయితే ఇప్పుడు జీపీఎఫ్ వడ్డీ రేట్లను ప్రకటించిన కేంద్రం.. దీనిని కూడా స్థిరంగానే ఉంచుతున్నట్లు వెల్లడించింది. ఈసారి వడ్డీ రేట్లు పెరుగుతాయని భావించినా నిరాశే ఎదురైంది.
కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) సహా ఇదే కేటగిరీకి చెందిన ఇతర పథకాల వడ్డీ రేట్లను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- జూన్ త్రైమాసికానికిగానూ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం ఈ వడ్డీ రేటు 7.10 శాతంగానే ఉండనుంది. 2025- 26 ఆర్థిక సంవత్సరం జనవరి- మార్చి త్రైమాసికంలో కూడా వడ్డీ రేట్లు ఇదే స్థాయిలో ఉన్నాయని చెప్పొచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద ఉండే ఆర్థిక వ్యవహారాల విభాగం బడ్జెట్ డివిజన్ ఈ వడ్డీ రేట్లకు సంబంధించి తాజాగా ఒక సర్క్యులర్ జారీ చేసింది. ప్రతి త్రైమాసికం ప్రారంభంలో.. కేంద్రం ఈ వడ్డీ రేట్లను సమీక్షిస్తుంటుంది. అయితే చాలా కాలంగా మాత్రం ఇక్కడ వడ్డీ రేట్లు పెరగట్లేదు. ఈసారి పెరుగుతుందని ఆశించినా.. అలా జరగకపోవడంతో ఉద్యోగులు నిరాశ చెందుతున్నారు.
జనరల్ ప్రావిడెంట్ ఫండ్తో పాటుగా.. ది కాంట్రిబ్యూటర్ ప్రావిడెంట్ ఫండ్ (ఇండియా), ది ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రావిడెంట్ ఫండ్, ది స్టేట్ రైల్వే ప్రావిడెంట్ ఫండ్, ది జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (డిఫెన్స్ సర్వీసెస్), ది ఇండియన్ ఆర్డ్నెన్స్ డిపార్ట్మెంట్ ప్రావిడెంట్ ఫండ్, ది ఇండియన్ ఆర్డ్నెన్స్ ఫ్యాక్టరీస్ వర్క్మెన్స్ ప్రావిడెంట్ ఫండ్, ది ఇండియన్ నావల్ డాక్యార్డ్ వర్క్మెన్స్ ప్రావిడెంట్ ఫండ్, ది డిఫెన్స్ సర్వీసెస్ ఆఫీసర్స్ ప్రావిడెంట్ ఫండ్, ది ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్ ప్రావిడెంట్ ఫండ్ వాటికి కూడా వడ్డీ రేట్లను 7.10 శాతం వద్దే ఉంచింది.

