
కూటమి ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారంటున్నారు మాజీ మంత్రి కొడాలి నాని. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. వైఎస్ జగన్ విలువ ఏపీ ప్రజలకు తెలిసొస్తుందని.. 2029లో జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. కూటమి సహా ఎవరూ దీన్ని ఆపలేరన్నారు. 2014 ఎన్నికల సమయంలో కూడా వైఎస్ జగన్ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వలేమని చెప్పిన విషయాన్ని కొడాలి నాని గుర్తు చేశారు.
2024 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విలువ ఏంటో తెలిసిందన్నారు మాజీ మంత్రి కొడాలి నాని . జగన్ను అనవసరంగా వదులుకున్నామని రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారని.. ఆయన ఉంటేనే తమకు మంచి జరుగుతుందని పేద వర్గాలు భావిస్తున్నాయని చెప్పుకొచ్చారు. 2029 ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునే సత్తా కూటమికి లేదని.. వైఎస్ జగన్ను ఎదుర్కోవడానికి చెల్లెళ్లను రోడ్డుపైకి తీసుకొచ్చి అనవసరమైన నిందలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి చనిపోతే ఆస్తిలో వాటాలు ఇచ్చేవారిని ఇప్పటి వరకు చూశామని.. కానీ తన సొంత ఆస్తిలో కూడా వాటాలు ఇచ్చిన వ్యక్తి వైఎస్ జగన్ అంటూ ప్రశంసించారు. జగన్ తన చెల్లెళ్ల గురించి ఎక్కడా తప్పుగా మాట్లాడలేదని.. కానీ వారు మాత్రం జగన్ గురించి చాలా దారుణంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

