
యుద్ధ ప్రభావంతో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడుతుండటం తీవ్ర కలవరపాటుకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. గ్యాస్ కొరత కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో హోటళ్లను మూసివేస్తుండటంతో పరిస్థితులు తీవ్రంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలోనూ హోటల్స్ మూతపడనున్నాయనే వార్తలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే దీనిపై తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ తాజాగా క్లారిటీ ఇచ్చింది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. మరీ ముఖ్యంగా హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే ముడి చమురును ఇరాన్ అడ్డుకోవడంతో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఎల్పీజీ, సీఎన్జీ ధరలు అమాంతం పెరుగుతుండగా.. ఇటీవలె భారత్లో గ్యాస్ ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో మరింత ధరలు పెరగడమే కాకుండా.. సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందనే భయాలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో హోటల్స్పై ప్రభావం పడి.. మూతపడతాయనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇప్పటికే దేశంలోని పలు కీలక నగరాల్లో రెస్టారెంట్లను మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో తీవ్ర భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గ్యాస్ కొరతతో ఇండియాలోని పలు మెట్రో నగరాల్లో హోటల్స్ తాత్కాలికంగా మూతపడుతున్నాయి. ఇప్పటికే బెంగళూర్ లో హోటల్స్ మూతపడ్డాయి. చెన్నైలో మూసివేస్తున్నట్లు అక్కడి హోటల్స్ అసోసియేషన్స్ ప్రకటించాయి. కమర్షియల్ సిలిండర్ల కొరత తెలుగు రాష్ట్రాలపై కూడా పడింది. ఇప్పటికే విశాఖలో హోటల్స్ మూసివేత ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు ప్రకటించారు.

