
రాష్ట్రంలోని పొగాకు రైతులకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు ప్రకటించింది. పొగాకు ధరల సమస్యపై మంత్రులు అచ్చెన్నాయుడు గొట్టిపాటి రవి డోలా శ్రీబాలవీర్భద్రరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పలు నిర్ణయాలు తీసుకున్నారు. పొగాకు రైతులకు ప్రతి క్వింటాల్కు ప్రభుత్వం తరఫున అదనంగా రూ.1,000 చెల్లించాలని నిర్ణయించారు. అలాగే పొగాకు నాణ్యతను నిర్ధారించేందుకు ఐదుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రులు వెల్లడించారు.
నాణ్యత పేరుతో వ్యాపారులు ఇష్టానుసారంగా ధరలు నిర్ణయించకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు రెండేళ్ల పాటు ఎలాంటి వడ్డీ లేకుండా రూ.50 వేల వరకు రుణాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పొగాకు కొనుగోలు చేసిన తొమ్మిది రోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రులు తెలిపారు.
రాబోయే ఏడాది పొగాకు సాగును 80 మిలియన్ కిలోలకు పరిమితం చేయాలని నిర్ణయించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పొగాకు రైతులకు సరైన మద్దతు లభించలేదని విమర్శించారు. అప్పట్లో మార్క్ఫెడ్ ద్వారా కేవలం 11 మిలియన్ కిలోల పొగాకును మాత్రమే కొనుగోలు చేశారని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలోనే రైతులకు మేలు జరుగుతోందని అచ్చెన్నాయుడు అన్నారు.
పొగాకు ధరల అంశాన్ని కొందరు రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రైతులు గతంలో జరిగిన పరిణామాలను గుర్తుంచుకోవాలని సూచించారు. నాణ్యత విషయంలోనూ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రులు స్పష్టం చేశారు. గ్రేడ్ తక్కువగా ఉందనే కారణంతో వ్యాపారులు తమకు నచ్చిన ధరలు నిర్ణయించకుండా నియంత్రణ చర్యలు తీసుకుంటామని తెలిపారు.

