
తెలంగాణలోని పట్టణ పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం ‘PMAY-U 2.0’ కింద 20 వేల ఇళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు రూ. 300 కోట్ల నిధులు విడుదల చేసింది. ఆ ఇళ్లను పట్టణాల్లోని పేదలకు కేటాయించనున్నారు. హైదరాబాద్ సహా ఇతర కార్పొరేషన్లలోని నిరుపేదలకు ప్రాధాన్యతనిస్తూ.. అసంపూర్తిగా ఉన్న 29 వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.
తెలంగాణలోని పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు రేవంత్ సర్కార్ ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ పథకం అమలవుతోంది. పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు కావటం లేదు. ఈ నేపథ్యంలో పట్టణ పేదలకు సొంత గూడు కల్పించే దిశగా రేవంత్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన – అర్బన్ 2.0’ పథకం కింద దాదాపు 20 వేల ఇళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు, సుమారు రూ.300 కోట్ల నిధులను విడుదల చేసింది.
హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలోని పేదలకు ఈ పథకం నిధులతో ఇందిరమ్మ ఇళ్లను భారీ స్థాయిలో అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లతో పాటు ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికలకు ముందే ఈ పథకాన్ని అమలు చేయాలని యోచిస్తోంది. హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల నిర్వహించిన సర్వేలో దాదాపు 9 లక్షల కుటుంబాలకు సొంత భూమి లేదని తేలింది. వారందరూ ప్రస్తుతం అద్దె ఇళ్లలోనే నివసిస్తున్నారని సర్వేలో గుర్తించారు. వీరిలో 2 లక్షల కుటుంబాలు రేకుల షెడ్లు, పూరి గుడిసెల్లో మగ్గుతున్నట్లు అధికారులు గుర్తించారు. వారందరికి ఈ పథకం కింద సొంత గూడును కల్పించనున్నారు.

