
మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత సంచలన అంశాలు బయటికి వస్తున్నాయి. లొంగిపోయే ప్రయత్నాల్లో ఉండగానే హిడ్మా, అతని భార్య ఎన్కౌంటర్ అయ్యారు. కొద్దిరోజుల క్రితమే ఆయుధాలను అడవిని వదిలేసి హిడ్మా జనజీవ స్రవంతిలో కలవాలనుకున్నారు. ఈలోపే ఏపీ పోలీసుల కాల్పుల్లో మోస్ట్ వాంటెడ్ మడవి హిడ్మా హతమయ్యారు. కొద్దిరోజుల క్రితం ఛత్తీస్ఘడ్ బస్తర్లో ఉన్న ఒక విలేఖరికి హిడ్మా లేఖ రాశారు.
ఆయుధాలు విడిచే ముందు తాను కొన్ని అంశాలపై చర్చించాలనుకున్నట్లు జర్నలిస్టుకి రాసిన ఆ లేఖలో పేర్కొన్నారు. తమ భద్రతకు భరోసా కల్పిస్తే సరేండర్ అయ్యేందుకు సిద్ధం అన్నట్లు ఆ లేఖ సారాంశం ఉంది. లొంగుబాటుకు సంబంధించి ఎక్కడ..? ఏ ప్రదేశం అన్నది నిర్ణయించాల్సి ఉందని ఆ లేఖలో హిడ్మా పేర్కొన్నారు.
తనను కలిసేందుకు ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిందిగా ఆ జర్నలిస్టును హిడ్మా కోరారు. హిడ్మా నవంబర్ 10 న ఈ లేఖ రాసినట్లు ఆలస్యంగా బయటపడింది.. అయితే అందరూ లొంగిపోయేందుకు సిద్ధంగా లేరని సైతం ఆ లేఖలో పేర్కొన్నారు.
తన ఆలోచనలతోపాటు నిర్ణయాలపై వీడియో రిలీజ్ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు విలేఖరికి రాశారు. నాలుగైదు రోజుల్లో హిందీతో పాటు తెలుగులోనూ ఒక ఆడియో స్టేట్మెంట్ ఇవ్వనున్నట్లు కూడా ఆ లేఖలో ఉంది. ఆయుధాలు విడిచే ముందు కొన్ని అంశాలు చర్చించాల్సి ఉందని లేఖలో సుధీర్ఘంగా హిడ్మా రాసినట్లు తెలుస్తోంది.
ఇంతలోనే ఏపీ బలగాల చేతిలో హిడ్మా ఎన్కౌంటర్కు గురయ్యారు. మరోవైపు హిడ్మా ఎన్కౌంటర్ తోపాటు.. మావోయిస్టుల అరెస్టుపై ఏపీ పోలీసులు ఈరోజు అధికారికంగా ప్రకటించనున్నారు. రంపచోడవరం ఏరియా హాస్పిటల్ లో హెడ్మాతోపాటు అతని భార్య రాజే అలియాస్ రాజక్క మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. పోస్టుమార్టం కోసం కాకినాడ వైజాగ్ నుండి ఫోరెన్సిక్ బృందం రంపచోడవడానికి రానుంది.
