
హైదరాబాద్ నగర ట్రాఫిక్ను తగ్గించేందుకు నగరంలో డబుల్ డెక్కర్ కారిడార్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెల్లడించారు. విజయవాడ వెళ్లే మార్గంలో ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ మధ్య ఈ డబుల్ డెక్కర్ కారిడార్ నిర్మించనున్నట్లు తెలిపారు. రూ.940 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు వివరించారు. 3 హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్లు కూడా ఇదే ప్రాంతానికి రానున్నాయని స్పష్టం చేశారు.
విశ్వ నగరంగా మారుతున్న హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతోంది. హైదరాబాద్లో పెరుగుతున్న ట్రాఫిక్ను కంట్రోల్ చేసేందుకు రాజధానిలో పలు రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. హయత్ నగర్ సాయిబాబా ఆలయం (తొర్రూర్ ఎక్స్ రోడ్) నుంచి జీ స్కూల్ వరకు సుమారు రూ.10 కోట్లతో రోడ్డు విస్తరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఇప్పటివరకు 2 లేన్లుగా ఉన్న రహదారిని 4 లేన్లుగా విస్తరించనున్నారు.
ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ రేడియో స్టేషన్ వరకు సుమారు 6 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ కారిడార్ నిర్మించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెల్లడించారు. ఈ ప్రాజెక్టును మొత్తం రూ. 940 కోట్ల వ్యయంతో చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో తన వాటాగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 200 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఈ డబుల్ డెక్కర్ కారిడార్లో పైన మెట్రో రైలు పరుగులు పెట్టనుండగా.. మధ్యలో నేషనల్ హైవే.. కింద స్థానికంగా ప్రయాణించే వాహనాల కోసం వెహికిల్ అండర్ పాస్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, ముంబై-పూణే నగరాలను కలుపుతూ 3 హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ఇదే ఎల్బీ నగర్, హయత్ నగర్ ప్రాంతం నుంచే రానున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. రానున్న రోజుల్లో హయత్ నగర్, ఇబ్రహీంపట్నం ప్రాంతాలు కోకాపేట లాగా మారే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు. అదే విధంగా హైదరాబాద్-విజయవాడ మధ్య 10 లేన్ల రహదారి పనులను కూడా త్వరలోనే ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు.

