
ఆకాశంలో క్షిపణులు, భూమిపై బాంబు పేలుళ్ల మధ్య ఇరాన్లోని భారతీయ వైద్య విద్యార్థులు నరకం చూస్తున్నారు. క్షణ క్షణం ప్రాణ భయంతో విలవిల్లాడిపోతున్నారు. కొందరు బంకర్లలో దాక్కోగా.. మరికొందరు ఉంటున్న ఇళ్లల్లోనే తలదాచుకుంటున్నారు. ఈక్రమంలోనే భారత విదేశాంగ శాఖ వెంటనే స్పందించిన తమను స్వదేశానికి తీసుకెళ్లాలని కోరుతున్నారు. తమ వద్ద ఉన్న నిత్యావసర సరుకులు నిండుకున్నాయని.. తినేందుకు ఆహారం కూడా లేక అలమటించాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. పిల్లల పరిస్థితి తెలుసుకున్న తల్లిదండ్రులు సైతం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలలతో అక్కడ చదువుకుంటున్న వందలాది మంది భారతీయ వైద్య విద్యార్థుల జీవితాలు అల్లకల్లోలంగా మారిపోయాయి. ముఖ్యంగా ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేస్తున్న దాడులు 10వ రోజుకు చేరుకోగా.. ఇరాన్లోని వివిధ నగరాల్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు ప్రాణ భయంతో వణికిపోతున్నారు. క్షిపణి దాడులు, బాంబు పేలుళ్ల మధ్య బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని చెబుతున్నారు. ఇప్పటికే తమ వద్ద ఉన్న నిత్యావసర సరుకులు కూడా అపోవస్తున్నాయని.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని రోజులు ఆగితే ఆకలితో అలమటించే పరిస్థితి వస్తుందని.. వెంటనే తమను స్వదేశానికి రప్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఆల్ ఇండియా మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎమ్ఎస్ఏ) తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాన్లోని ఇస్ఫాహాన్, ఖోమ్, కెర్మాన్, షిరాజ్ వంటి నగరాల నుంచి ఇప్పటి వరకు 18కి పైగా అత్యవసర విన్నపాలు అందాయి. ముఖ్యంగా ఇస్ఫాహాన్ నగరంలోని ‘దర్వాజే-యే షిరాజీ’ ప్రాంతంలో తమ హాస్టల్ సమీపంలోనే పేలుళ్లు సంభవించడంతో.. సుమారు 32 మంది భారతీయ మెడికోలను భూగర్భ బంకర్లలోకి తరలించినట్లు సమాచారం. మార్చి 7, 8 తేదీల్లో క్షణ క్షణం పేలుళ్లు వినిపిస్తుండటంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

