
ఆంధ్రప్రదేశ్లో జూనియర్ డాక్టర్లు (జూడాలు) సమ్మెకు సిద్ధమవుతున్నారు. తమ స్టైఫండ్ పెంపుపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆగస్టు 15వ తేదీలోగా ప్రభుత్వం తమ డిమాండ్లపై నిర్ణయం ప్రకటించాలని, లేకపోతే ఆగస్టు 17 నుంచి సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇందులో భాగంగా ఆగస్టు 15 వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని జూనియర్ డాక్టర్లు నిర్ణయించారు. అలాగే సమ్మె కార్యక్రమంలో భాగంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎమర్జెన్సీ సేవలను బహిష్కరించాలని నిర్ణయించినట్లు APJUDA వెల్లడించింది.
రెసిడెంట్ డాక్టర్లకు సంబంధించిన న్యాయబద్ధమైన, చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని APJUDA కోరింది. ముఖ్యంగా స్టైఫండ్ పెంపుపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేసింది. తమ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కారం చూపుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది.
సమ్మె సమయంలో డీఆర్పీ (DRP), పెరిఫెరల్ పోస్టింగ్స్ను నిలిపివేస్తామని APJUDA తెలిపింది. అదే సమయంలో సాధారణ వైద్య సేవలకు సాధ్యమైనంత తక్కువగా అంతరాయం కలిగేలా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా అత్యవసర వైద్య సేవలకు ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేసింది. అయితే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎమర్జెన్సీ సేవల బహిష్కరణ చేపట్టనున్నట్లు ప్రకటించింది.
తమ డిమాండ్లపై ప్రభుత్వం నిర్ణీత గడువులోగా స్పందించాలని జూనియర్ డాక్టర్లు కోరారు. ప్రభుత్వం నుంచి చర్చలకు ఆహ్వానం వస్తే గడువు ముగియకముందే ఎప్పుడైనా చర్చలకు సిద్ధంగా ఉన్నామని APJUDA స్పష్టం చేసింది. సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని తాము కోరుకుంటున్నామని, ప్రభుత్వం కూడా సానుకూల దృక్పథంతో స్పందించాలని విజ్ఞప్తి చేసింది.
దీంతో జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ పెంపుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశంపై వైద్య వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే ఆగస్టు 17 నుంచి జూడాల సమ్మె మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది.

