
తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆసుపత్రికి వెళ్లారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో సుమారు 45 నిమిషాల పాటు చర్చించి వివరాలు తెలుసుకున్నారు.
పెద్ది సుదర్శన్ రెడ్డికి అత్యున్నత స్థాయి వైద్యం అందిస్తున్నామని, అవసరమైతే విదేశీ నిపుణుల సలహాలు కూడా తీసుకుంటున్నామని వైద్యులు కేసీఆర్కు తెలిపారు. గుండె, ఊపిరితిత్తులు సహా ఇతర అవయవాలు సక్రమంగా పనిచేస్తున్నాయని, అయితే మెదడు పూర్తిగా స్పందించేందుకు మరో 48 గంటలు పట్టే అవకాశం ఉందని వివరించారు.
ఈ సందర్భంగా “మీరేం చేస్తారో చేయండి… మా పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడండి” అంటూ కేసీఆర్ వైద్యులకు చేతులెత్తి నమస్కరిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన ధైర్యం చెప్పి, అవసరమైన అన్ని విధాలా పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

