
ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే అతి పెద్ద స్టీల్ప్లాంట్కు శంకుస్థాపన జరిగింది. ఈ మిట్టల్ స్టీల్ప్లాంట్ రాష్ట్రానికి రావడం వెనుక 2024లో ఓ జూమ్ కాల్ కారణమంటూ మంత్రి లోకేష్ ఆసక్తికర విషయాలు చెప్పారు. తాను 2019లోనే మిట్టల్ సంస్థ పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేశానని.. చివరికి 2024లో సక్సెస్ అయ్యామంటూ ఆ రోజు ఏం జరిగిందో మంత్రి లోకేష్ చెప్పుకొచ్చారు.
అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్ స్టీల్ ఇండియా స్టీల్ప్లాంట్కు శంకుస్థాపన జరిగింది. అయితే ఈ పరిశ్రమ రాష్ట్రానికి వచ్చేందుకు ఓ జూమ్ కాల్ కారణమంటూ మంత్రి లోకేష్ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. 2019 నుంచి 2024 వరకు ఏం జరిగిందో వివరించారు. తాను 2019 జనవరిలో దావోస్ పర్యటనకు వెళ్లినప్పుడు ఆర్సెలార్ మిట్టల్ సీఈవో ఆదిత్య మిట్టల్ను కలవడానికి ప్రయత్నించానన్నారు లోకేష్. కానీ ఆ సమయంలో కుదరలేదని.. అయితే ఆ తర్వాత ఆయన్ను కలిసే అవకాశం వచ్చిందన్నారు. ఆదిత్యను కలిసి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరానని.. ఆయన మాత్రం తాము వేరే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు చూస్తున్నామని తనతో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఒకవేళ ఆ ప్రయత్నాలు జరగకపోతే ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల కోసం సిద్ధంగా ఉందని ఆ రోజు ఆదిత్యకు చెప్పానన్నారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదిత్య మిట్టల్తో మాట్లాడిన ఓ జూమ్ కాల్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ను మార్చేసిందన్నారు.
2024 సెప్టెంబర్ 22న రాత్రి ఆదిత్య మిట్టల్తో తాను అరగంట పాటూ జూమ్ కాల్లో మాట్లాడానన్నారు మంత్రి లోకేష్. ఆ చర్చల ఫలితంగా.. దేశంలోనే అతి పెద్ద స్టీల్ప్లాంట్ ఆంధ్రప్రదేశ్కు వచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు ఈ మిట్టల్ స్టీల్ప్లాంట్ రాక నిదర్శమన్నారు. ఆదిత్య మిట్టల్తో మాట్లాడిన తర్వాత రెండు నెలలకే ఏపీ ప్రభుత్వం నుంచి స్టీల్ప్లాంట్కు అవసరమైన ప్రోత్సాహకాలు అందించామన్నారు. మూడు నెలల్లో పరిశ్రమకు అవసరమైన భూమి.. ఆ వెంటనే పర్యావరణ, అటవీ అనుమతులు కూడా వచ్చాయన్నారు.

