
కేంద్రం నుంచి అనంతపురం ఆర్డీటీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏను రెన్యువల్ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఏడాది క్రితం ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద విదేశీ నిధులకు బ్రేకులు. ఏపీ ప్రభుత్వం తరఫున కేంద్రానికి రిక్వెస్ట్ చేయడంతో మళ్లీ రెన్యువల్ చేశారు. కేంద్రానికి ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు.
తెలుగు రాష్ట్రాలకు, అనంతపురం జిల్లావాసులకు కేంద్రం నుంచి తీపికబురు అందింది. అనంతపురం ఆర్డీటీ (రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్) సేవలకు అనుమతి వచ్చింది. ఆర్డీటీ విదేశీ నిధులు పొందేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ఆర్డీటీ విదేశీ నిధులు వినియోగించుకునేందుకు వీలుగా.. ఎఫ్సీఆర్ఏను రెన్యువల్ చేసినట్లు ఆర్డీటీ ప్రతినిధులకు కేంద్ర హోంశాఖ నుంచి సమాచారం ఇచ్చింది. ఆర్డీటీకి లైన్ క్లియర్ అయ్యిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తెలిపారు.
రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థ అనంతపురం జిల్లాతో పాటుగా పలు ప్రాంతాల్లో విద్య, వైద్యం, స్వయం ఉపాధి వంటి సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఆర్డీటీకి విదేశాల నుంచి నిధులు వస్తుంటాయి.. అయితే ఈ నిధుల వినియోగానికి అనుమతుల్ని కేంద్రం నిలిపివేసింది. ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (FCRI) కింద కేంద్రం ఈ చర్యలు తీసుకుంది. అప్పటి నుంచి ఆర్డీటీకి సంబంధించి ఫారిన్ కాంట్రిబ్యూషన్ అకౌంట్లలో ఉన్న డబ్బుల్ని వినియోగించడానికి అడ్డంకులు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి ఆర్డీటీ సేవా కార్యక్రమాలకు ఆటంకం కలిగింది. ఏపీ ప్రభుత్వం ఆర్డీటీకి సంబంధించిన సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. ఢిల్లీ వెళ్లిన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ఎంపీలు వినతిపత్రాలు సమర్పించారు. కేంద్రం సానుకూలంగా స్పందించి.. ఎఫ్సీఆర్ఏను రెన్యువల్ చేసింది. దీంతో ఆర్డీటీ సేవా కార్యక్రమాలను త్వరలోనే మళ్లీ ప్రారంభించనుంది.

