
రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు అంతరాయం కలిగింది. సాంకేతిక లోపాలు తలెత్తి.. సర్వర్లు పనిచేయకపోవడంతో.. ఉదయం నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల వద్ద తీవ్ర గందరగోళం తలెత్తింది. రిజిస్ట్రేషన్లు, స్లాట్ బుకింగ్లు, చలానాల చెల్లింపుల కోసం జనం భారీ ఎత్తున తరలి రాగా.. సర్వర్లు పనిచేయక పోవడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు బ్రేక్ పడింది. ఉదయం నుంచి సర్వర్లు పని చేయకపోవడంతో.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనులు సాగడం లేదు. దీంతో స్లాట్ బుకింగ్ చేసుకుని.. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన ప్రజలు.. గంటల తరబడి ఆఫీసుల ముందు పడిగాపులు కాస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచే టెక్నికల్ సమస్యలు తలెత్తడంతో సర్వర్లు పనిచేయకుండా పోయాయి. దీంతో తెలంగాణ వ్యాప్తంగా భూములు, ఆస్తులకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. స్లాట్ బుకింగ్లు, చలాన్ల చెల్లింపులు కూడా ఆగిపోయాయి.
ఈ క్రమంలోనే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల వద్ద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూమి బదిలీ చేసేందుకు కార్యాలయాలకు వచ్చిన కొందరు నిరాశతో వెనుదిరిగి ఇంటికి వెళ్తుండగా.. మరికొందరు రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో అక్కడే వేచి చూస్తున్నారు. కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను జనం నిలదీస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లోని సర్వర్లలో సాంకేతిక లోపాలు తలెత్తడంతోనే ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు.

