
కనకదుర్గమ్మ భక్తులకు ముఖ్య గమనిక. విజయవాడ ఇంద్రకీలాద్రిపై మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు. మార్చి 6వ తేదీ నుంచి 8 వరకూ మూడు రోజుల పాటు కనకదుర్గమ్మ ఆలయంలో మహా కుంభాభిషేకం మహోత్సవం జరగనుంది. ఇందుకోసం దుర్గ గుడి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహాకుంభాభిషేకం 12 ఏళ్లకు ఒకసారి వస్తుందని.. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని అధికారులు కోరుతున్నారు. మరోవైపు కుంభాభిషేకంలో ముఖ్యమైన ఘట్టం మార్చి 8వ తేదీ ఉదయం నిర్వహించనున్నారు.
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో మహా కుంభాభిషేకం జరగనుంది. ఇంద్రకీలాద్రిపై జరగనున్న మహా కుంభాభిషేకం మహోత్సవం -2026కు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 6వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకూ మూడు రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై కుంభాభిషేకం మహోత్సవం జరగనుంది. ఆగమ శాస్త్రాల ప్రకారం 12 ఏళ్లకు ఒకసారి ఇంద్రకీలాద్రిపై మహా కుంభాభిషేకం నిర్వహిస్తారు. 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ పవిత్ర ఆచారం ఆలయ దైవిక శక్తిని పునరుజ్జీవింపజేస్తుందని అర్చకులు, పండితులు చెప్తున్నారు.
కనకదుర్గమ్మ ఆలయంపై ఉన్న కలశం మహా విష్ణువు, శివుడు, బ్రహ్మలతో పాటుగా జగన్మాతకు ప్రతీకగా చెప్తుంటారు. మహాకుంభాభిషేకంలో భాగంగా.. పవిత్ర నదులు, సముద్రాల నుంచి సేకరించిన పవిత్ర జలాలను.. యాగశాలలో కలశాలలోకి ఆవాహన చేస్తారు, వీటితో పాటు మంత్రోచ్ఛారణలు, హోమాలు, ఆగమ ప్రక్రియలు శాస్త్రోక్తంగా చేపడతారు. ఈ ఆచారం భక్తులకు, సమాజానికి మంచిని, ఆధ్యాత్మిక శ్రేయస్సును కలగజేస్తుందని విశ్వాసం. మహాకుంభాభిషేకంలో భాగంగా మార్చి 6వ తేదీ గణపతి పూజతో కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. ఆ తర్వాత పుణ్యాహవచనం, దీక్షాధారణ, అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత మూల మంత్ర హవనమ్ కార్యక్రమం ఉంటుంది.

