
దిగ్గజ పారిశ్రామిక వేత్త, భారత అపర కుబేరుడు ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ.. ఏప్రిల్ 10న 31వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. కొంత కాలంగా పలు దేవాలయాలకు విరాళాలు ఇస్తున్న అనంత్ ఇప్పుడు బర్త్డేకు ముందు కూడా గుజరాత్లోని ఒక ఆలయానికి రూ. 10 కోట్ల విరాళం ప్రకటించారు. ఇక్కడ ఆవులకు గోశాల నిర్మాణం కోసం ఇవ్వడం విశేషం.
సుమారు 28 ఎకరాల విస్తీర్ణంలో స్వీడన్ సంస్థ డెలావల్ సహకారంతో.. అంతర్జాతీయ ప్రమాణాలతో గోశాలను నిర్మిస్తున్నారు. ఇక్కడ సుమారు 500 వరకు ఆవులు వసతి పొందేలా తీర్చిదిద్దుతున్నారు. ఈ మొత్తం ప్రాజెక్టును అంబానీ కుటుంబమే చూసుకుంటోంది. ఏకైక దాతగా వీరే ఉన్నారు. అనంత్ అంబానీకి మూగజీవాల పట్ల విపరీతమైన ప్రేమ ఉందన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇలా ఆవుల కోసం తన పుట్టినరోజుకు ముందు విరాళం ఇచ్చి మరోసారి ప్రేమను చాటుకున్నారు.
ఇదే సమయంలో రాజస్థాన్ జైపూర్ శివార్లలో హాథీ గావ్లో అనంత్ అంబానీ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. వన్యప్రాణుల కోసం ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా హాథీ గావ్ వికాస్ సమితి వినూత్నంగా వేడుకను నిర్వహించింది. ఇందులో భాగంగా ఏనుగుల కోసం ఇక్కడ అరటిపండ్లు, చెరకు, బెల్లం, పుచ్చకాయలు, ఆపిల్స్, బొప్పాయి ఇలా దాదాపు 3 వేల కిలోల పండ్లతో భారీ బఫే ఏర్పాటు చేయడం ప్రత్యేకంగా నిలిచింది. ఇంకా బాబు, చంద, పుష్ప అనే 3 ఏనుగులు.. వాటి తొండాలతో అనంత్ అంబానీ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రత్యేక వేడుక కోసం దాదాపు 100 ఏనుగుల్ని రాజస్థానీ సంప్రదాయ పద్ధతిలో రంగురంగుల దుస్తులు, ఆభరణాలతో అలంకరించినట్లు తెలిసింది.

