
నాలుగేళ్ల కిందట వివాహం చేసుకున్న ఓ జంట మధ్య కొద్ది రోజుల్లకే మనస్పర్దలు వచ్చాయి. ఇరువురి మధ్య తరుచూ గొడవలతో విబేధాలు వీధికెక్కాయి. తనకు విడాకులు కావాలని భర్త డిమాండ్ చేయడం, మహిళను వంటింటిలోకి వెళ్లకుండా అత్తింటివాళ్లు అడ్డుకోవడంతో ఆమె తీవ్ర ఆవేదనకు గురయ్యింది. దీంతో భర్త, అత్తపై గృహహింస కేసు పెట్టింది. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ సదరు భర్త బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. పిటిషన్పై నాగ్పూర్ ధర్మాసనం విచారణ చేపట్టింది.
అత్తింటిలో మహిళను వంట చేయకుండా నిరోధించడం అనేది ఆమె గౌరవాన్ని దెబ్బతీసే ఒక రకమైన మానసిక క్రూరత్వమేనని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. తనకు వ్యతిరేకంగా భార్య పెట్టిన వేధింపుల కేసును కొట్టివేయాలంటే భర్త దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. కేసు వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రకు చెందిన ఓ జంటకు 2022లో వివాహమైంది. అయితే, పెళ్లైన కొద్ది రోజుల నుంచే భార్యాభర్తల మధ్య విబేధాలు మొదలయ్యాయి. భార్యను వేధింపులకు గురిచేశారు. అత్తింటివాళ్లు తనను అత్యంత హీనంగా చూశారని, తన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించారని ఆమె ఆరోపించారు.
ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు నాగ్పూర్ ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్ ఊర్మిళా జోషి-ఫాల్కే.. భర్తకు వ్యతిరేకంగా నమోదైన వేధింపుల కేసును కొట్టేయడానికి నిరాకరించారు. భార్యను నిరంతరం వేధించడం, ఆమె కదలికలను పరిమితం చేయడం, ఇంట్లో ఆమెకు కనీస అవసరాలను అందకుండా చేయడం వంటివి మానసిక క్రూరత్వానికి స్పష్టమైన ఉదాహరణలని వ్యాఖ్యానించారు.

