
భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్, స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన పెళ్లి అనుకోని విధంగా వాయిదా పడింది. ఆదివారం (నవంబర్ 23) మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్తో ఆమె వివాహం జరగాల్సి ఉంది. కానీ అదే రోజు ఉదయం కుటుంబంలో చోటుచేసుకున్న విషాదకర సంఘటన కారణంగా పెళ్లిని వాయిదా వేశారు.
ఆదివారం ఉదయం అల్పాహారం తీసుకుంటున్న సమయంలో స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధానకు అకస్మాత్తుగా అనారోగ్యం పాలయ్యారు. పరిస్థితి విషమించడంతో వెంటనే సాంగ్లీలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం డాక్టర్ల బృందం ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోంది.
తండ్రికి అస్వస్థత కలగడంతో స్మృతి మంధాన ఒక భావోద్వేగపూరితమైన కఠిన నిర్ణయం తీసుకున్నారు. స్మృతి మేనేజర్ తుహిన్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం.. తండ్రి శ్రీనివాస్ మంధాన పూర్తిగా కోలుకునే వరకు పెళ్లి చేసుకోకూడదని స్మృతి స్వయంగా నిర్ణయించుకున్నారు.
అందుకే పెళ్లిని వాయిదా వేశారు.. అంతేకాకుండా, స్మృతి తన సోషల్ మీడియాలో కూడా ఈ బాధను పంచుకున్నారు. ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఎంగేజ్మెంట్ వీడియోతో సహా, పెళ్లికి సంబంధించిన పోస్టులు అన్నింటినీ తొలగించారు. స్మృతి మంధాన తీసుకున్న ఈ అకస్మాత్తు నిర్ణయం ఆమె అభిమానులను కూడా ఆశ్చర్యపరిచింది.
