
మధ్యప్రాచ్యంలో ఘర్షణలు తీవ్రమవుతున్న నేపథ్యంలో, టెహ్రాన్పై జరిగిన ఒక భారీ దాడిలో ఇరాన్కు చెందిన పలువురు ఉన్నత సైనికాధికారులు మరణించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. తన సోషల్ మీడియా వేదికలో ఒక పోస్ట్లో ట్రంప్ ఈ ప్రకటన చేశారు. దానితో పాటు ఆయన ఒక వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో చీకటి రాత్రి ఆకాశంలో ఒక పెద్ద పేలుడు, మంటలు కనిపిస్తున్నాయి.
ఆ ప్రాంతంలో యుద్ధం తీవ్రమవుతూ, పరిస్థితి దిగజారుతున్న తరుణంలో ట్రంప్ ఈ ప్రకటన చేశారు. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోకపోయినా, హోర్ముజ్ జలసంధిని తెరవకపోయినా తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ట్రంప్. ఇదిలావుంటే, డొనాల్డ్ ట్రంప్ గతంలో ఇరాన్కు 48 గంటల అల్టిమేటం జారీ చేశారు. ప్రపంచ చమురులో 20 శాతం దిగుమతి అయ్యే సముద్ర మార్గమే ఈ హోర్ముజ్ జలసంధి. దీనిని మూసివేయడం ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన చమురు కొరతకు దారితీసింది.
ఇదిలా ఉండగా, యుద్ధంలో తొలిసారిగా ఇరాన్లో ఒకే రోజు రెండు అమెరికా యుద్ధ విమానాలను కూల్చివేశారు. ఒక పైలట్ను రక్షించారు, మరొకరు గల్లంతయ్యారు. శత్రు భూభాగంలో అత్యంత సాహసోపేతమైన ‘మిషన్ ఇంపాజిబుల్’ ఆపరేషన్ చేపట్టిన తప్పిపోయిన అధికారిని సురక్షితంగా కాపాడారు. మరోవైపు అమెరికా ప్రభుత్వంపై స్థానికులు తీవ్ర నిరసనలు తెలుపుతున్నారు.
అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, ఆర్మీ చీఫ్ జనరల్ రాండీ జార్జ్ను పదవి నుంచి తక్షణమే పదవీ విరమణ చేయమని కోరారు. దీని వెనుక గల కారణాలను బహిరంగపరచనప్పటికీ, యుద్ధంపై పెరుగుతున్న ఒత్తిడి, విమర్శల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.

