
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు.. భారత స్టాక్ మార్కెట్లను ముంచేస్తున్నాయి. క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటం.. విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంటుండటంతో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోతున్నారు. ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి చూస్తే ప్రతి రోజూ సగటున రూ. 1000 కోట్లకుపైగా పెట్టుబడులు తరలిపోతున్నాయి. ఈ క్రమంలోనే రూ. 1 లక్ష కోట్లకుపైగా పెట్టుబడులు భారత మార్కెట్ల నుంచి బయటికి వెళ్లాయి.
యుద్ధం కారణంగా పశ్చిమాసియా సహా అంతర్జాతీయంగా తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా కూడా ఇజ్రాయెల్తో కలిసింది. ఇదే క్రమంలో ఇరాన్ ఈ దేశాలతో పాటుగా సమీప గల్ఫ్ దేశాలపైనా దాడులు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు అత్యంత కీలకంగా ఉన్నటువంటి హార్ముజ్ జలసంధి దగ్గర చమురు, గ్యాస్ నౌకలు, ట్యాంకర్లను ఇరాన్ అడ్డుకుంటుండటంతో. బ్రెంట్ క్రూాడాయిల్ ధర యుద్ధానికి బ్యారెల్కు 70 డాలర్ల దిగువన ఉండేది ఇప్పుడు అది 110 డాలర్లకు చేరువైంది. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతినగా.. స్టాక్ మార్కెట్లు కూడా కుప్పకూలుతున్నాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి భారీ స్థాయిలో పతనం అవుతూనే ఉన్నాయి.
అంతర్జాతీయంగా ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధానంగా విదేశీ పెట్టుబడిదారులు .. మన మార్కెట్లపై నమ్మకం ఉంచట్లేదు. దీంతో రోజురోజుకూ పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయి. ఆర్థిక అనిశ్చితి సహా క్రూడాయిల్ ధరలు పెరగడం వల్ల ఫారెన్ ఇన్వెస్టర్లు.. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రూ. 1 లక్ష కోట్లకుపైగా విలువైన పెట్టుబడుల్ని ఉపసంహరించుకోవడం గమనార్హం. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 20 వరకు సరిగ్గా రూ. 1,00,040 కోట్ల పెట్టుబడులు వెనక్కి మళ్లాయి. ఈ సమయంలో.. శని, ఆదివారాలు సహా ఇతర పబ్లిక్ హాలిడేస్ మినహాయిస్తే 16 ట్రేడింగ్ సెషన్లు జరిగాయి.

