
భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఏప్రిల్ 1 సెషన్లో ఒక్కసారిగా దూసుకెళ్లాయి. మార్చి నెలలో భారీగా పతనమైన సూచీలు.. ఇప్పుడు బుధవారం సెషన్లో లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 2 వేల పాయింట్ల వరకు పెరగ్గా.. ఇన్వెస్టర్ల సంపద రూ. 13 లక్షల కోట్ల వరకు పెరిగింది. బీఎస్ఈ, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్, ఐటీ స్టాక్స్ అన్నీ భారీగా పుంజుకున్నాయి. యుద్ధం ముగింపుపై సంకేతాల నేపథ్యంలో సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
హమ్మయ్యా.. వరుస నష్టాల నుంచి భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఎట్టకేలకు బుధవారం సెషన్లో (ఏప్రిల్ 1) పుంజుకున్నాయి. మార్చి నెలలో విపరీతంగా సూచీలు పడిపోయిన సంగతి తెలిసిందే. పశ్చిమాసియాలో ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ ఒకటే 9 వేల పాయింట్లకుపైగా పడిపోయింది. ఇది సుమారు 11 శాతానికి సమానం. దీంతో మదుపరుల సంపదగా పరిగణించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ నెలలోనే రూ. 51 లక్షల కోట్లు పడిపోయింది. అయితే ఇప్పుడు ఏప్రిల్ 1న సూచీలు భారీగా పుంజుకున్నాయి. ప్రారంభంలో సెన్సెక్స్ ఏకంగా 2 వేల పాయింట్లకుపైగా పెరగ్గా.. ఇన్వెస్టర్ల సంపద రూ. 13 లక్షల కోట్ల మేర పెరిగింది.
దాదాపు అన్ని స్టాక్స్ భారీగా పుంజుకున్నాయి. బీఎస్ఈ షేర్ ధర 7 శాతం వరకు పుంజుకుంది. ఐనాక్స్ ఇండియా 5 శాతం పెరిగింది. రిలయన్స్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్ వంటి హెవీ వెయిట్ స్టాక్స్ 2 శాతం వరకు పెరిగాయి. డీమార్ట్, ఇండిగో షేర్లు అయితే 8 శాతానికిపైగా పుంజుకోవడం విశేషం. చాలా రోజుల తర్వాత టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, విప్రో, ఎల్ అండ్ టీ, టెక్ మహీంద్రా ఇలా అన్ని ఐటీ స్టాక్స్ కూడా 2 శాతానికిపైగా లాభాల్లో కొనసాగుతున్నాయి.

