
విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి మరో కీలక అడుగు ముందుకు పడింది. ప్రాజెక్టులో కీలకమైన భూసేకరణ కోసం ఏపీ మెట్రోరైలు కార్పొరేషన్ ప్రతినిధులు గన్నవరంలో పర్యటించారు. రెవెన్యూ, ఇతర శాఖల అధికారులతో కలిసి ఆ భూముల్ని పరిశీలించి కొలతలు తీసుకున్నారు. గన్నవరం దగ్గర ప్రతిపాదించిన మెట్రో స్టేషన్లకు అవసరమైన భూమిని ఈ టీమ్ పరిశీలించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తాజాగా ఈ ప్రాజెక్ట్కు సంబంధించి కీలకమైన భూసేకరణకు తొలి అడుగు పడింది. ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ టీమ్ గన్నవరం ప్రాంతంలో పర్యటించింది. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులో ఫేజ్-1 భాగంగా మొదటి కారిడార్ విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం వరకు ప్లాన్ చేశారు. ఈ రూట్లో గన్నవరం దగ్గర నిర్మించాల్సిన మెట్రో స్టేషన్ల కోసం 1.35 ఎకరాలను భూమి అవసరం ఉందని గుర్తించారు అధికారులు.
గన్నవరంలోనే హెచ్సీఎల్ పక్కనే ఎన్టీఆర్ వెటర్నరీ కాలేజీ లైవ్స్టాక్ యూనిట్ దగ్గర మొత్తం 61.15 ఎకరాల భూమి ఉంది. దీనిని మెట్రో డిపో నిర్మాణం కోసం సమీకరించాలని నిర్ణయించారు. ఈ భూముల సమీకరణకు సంబంధించి మెట్రోరైలు కార్పొరేషన్ ప్రతినిధులు గన్నవరం తహసీల్దార్, పంచాయతీ రాజ్, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్, ఇతర శాఖల అధికారులు పర్యటించారు. అక్కడ స్థానికంగా భూసేకరణ రైతుల వివరాలు, అక్కడి పరిస్థితులపై నివేదిక సమర్పించాలని రెవెన్యూ శాఖను కోరారు. అలాగే ప్రతిపాదిత భూముల్లో కొలతలు కూడా తీసుకున్నారు.
విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్ట్ లో భాగంగా మొదటి దశలో కారిడార్ 1ఏ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం వరకు ఉంది. 1బీ కింద పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకు ప్లాన్ చేశారు. మొత్తం దూరం 38.40 కి.మీ కాగా.. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.11,009 కోట్లుగా ఉంది. భూసేకరణ కోసం రూ.1,152 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. రెండో దశలో భాగంగా విజజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతి (రిజర్వాయర్ స్టేషన్) దూరం: 27.75 కి.మీ ప్రతిపాదించారు. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్ట్ తొలిదశలో చేపట్టబోయే కారిడార్ 1ఏ, కారిడార్ 1బీ కింద కృష్ణా, ఎన్టీఆర్ రెండు జిల్లాల పరిధిలో 82.66 ఎకరాల భూమి అవసరమని గుర్తించారు. వీటిలో కృష్ణా జిల్లా పరిధిలో 70.95 ఎకరాలు, ఎన్టీఆర్ పరిధిలో 11.71 ఎకరాలు సేకరించాలని నిర్ణయించారు.

