
శ్రీకాకుళంలో డయోరియా వ్యాప్తి, రాజమండ్రిలో కల్తీ పాల ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం వంటి ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాగునీరు కలుషితం వల్ల శ్రీకాకుళంలో డయోరియా ప్రబలింది. రెండు రోజుల్లోనే డజన్ల కొద్దీ జనం అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చేరారు. వీరిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇక, రాజమంద్రి ఘటన అందర్నీ కలచివేస్తోంది. ఈ క్రమంలో సీఎం గురువారం సమీక్ష నిర్శహించి, అధికారులకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. ప్రజల మధ్యకు వెళ్తనే సమస్యలు తెలుస్తాయని అన్నారు.
అధికారులు తీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో డయేరియా, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పాలకల్తీ ఘటనలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఆకస్మిక తనిఖీలకు మీరు వెళ్తారా? నేను మొదలు పెట్టాలా?’అని వ్యాఖ్యానించారు.
ఆఫీసుల్లో కూర్చుంటే వాస్తవాలు తెలియవని, క్షేత్రస్థాయిలో పర్యటించాలని అన్నారు.‘‘క్షేత్రస్థాయిలో ప్రజలను కలిసి మాట్లాడితే సమస్యలు తెలుస్తాయి. మీరు వెళ్లకుంటే నేను వెళ్లడం మొదలుపెడతా’’ అని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. రాజమండ్రిలో కల్తీ పాల ఘటనలో ఇప్పటి వరకూ ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. వీరికి చికిత్స కోసం ముంబయి నుంచి ఔషధాలను తెప్పించినట్టు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా డయోరియా ప్రబలకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు వెలువరించింది. కలుషితం కాని, సురక్షిత తాగునీరు సరఫరాకు మున్సిపల్ శాఖ నిర్దిష్ఠ ప్రమాణాలను జారీ చేసింది. ఈ మేరకు పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సురేశ్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణాలు, నగరాల్లో తాగునీరు కలుషితమైతే ఉపేక్షించేది లేదని, ఆయా మున్సిపల్ కమిషనర్లపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఎప్పటికప్పుడు తాగునీటి పైపులైన్లు తనిఖీ చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

