
ప్రైవేట్ టావ్రెల్స్ బస్సుల్లో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతుండటంతో రవాణఆశాఖ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. బస్సుల్లో ప్రయాణించేవారికి కొన్ని జాగ్రత్తలు సూచిస్తూ వారికి అవగాహన కల్పిస్తున్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఓ అధికారి ట్రావెల్స్ బస్సును ఆపి ప్రయాణికులకు కొన్నిజాగ్రత్తలు చెప్పారు. ఒకవేళ బస్సుల్లో మంటలు చెలరేగితే విలువైన వస్తువుల కోసం సమయం వృథా చేయొద్దని సూచించారు. ప్రయాణికులు బస్సు ఎక్కగానే ఎమర్జెన్సీ డోర్ ఎక్కడుందో ముందే తెలుసుకోవాలన్నారు.
ఇటీవల కాలంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. కర్నూలులో గతేడాది జరిగిన ఘటన, ఇటీవల మార్కాపురం బస్సు ప్రమాద ఘటన తీవ్ర విషాదాన్ని నింపాయి. ఈ ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్రంలో ఆర్టీఏ (రవాణాశాఖ) అధికారులు, పోలీసులు రంగంలోకి దిగి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు చేపట్టారు. అలాగే బస్సుల్లో ప్రయాణికులు కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఓ రవాణాశాఖ అధికారి ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రయాణికులు పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో మంత్రి లోకేష్ స్పందించి.. ఆ అధికారిని అభినందించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సిద్దిఖ్ ప్రయాణికులతో మాట్లాడిన సమయంలో వీడియో తీయడంతో వైరల్ అయ్యింది.
ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే.. ఆ సమయంలో విలువైన వస్తువులు ఉన్నాయని బస్సులో ఉండిపోకుండా బయటకు వెళ్లి ప్రాణాలు కాపాడుకోవాలని ఆర్టీఏ అధికారి సూచించారు. మార్కాపురం బస్సు ప్రమాద ఘటనకు సంబంధించిన ఓ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. మార్కాపురం బస్సు ప్రమాదం జరిగిన సమయంలో ఎగ్జిట్ డోర్ దగ్గర ముగ్గురు ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ‘ఆ ముగ్గురు మేం ముందు వెళ్లాలి, మేం ముందు వెళ్లాలి అనుకున్నారు.. కానీ ముగ్గురు అక్కడ ఇరుక్కుపోయారు.. ఒకరి తర్వాత మరొకరు వెళ్లుంటే ముగ్గురు బతికేవారు.. వారి వెనుక మరో ఇద్దరు ఎఫెక్ట్ అయ్యుంటారు’ అని తొందరపాటులో ముగ్గురి ప్రాణాలు పోయాయని వివరించారు.

