
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మే 14, 15 తేదీల్లో బీజింగ్ పర్యటనకు వెళ్లనున్నారు. అయితే ట్రంప్ బీజింగ్ టూర్కు ఐదు వారాల ముందే ఓ ప్రత్యేక అతిథి చైనాలో అడుగుపెట్టారు. దశాబ్ద కాలం తర్వాత తైవాన్ ప్రతిపక్ష నేత చైనాలో పర్యటిస్తున్నారు. కువోమింటాంగ్ (కేఎంటీ) ఛైర్పర్సన్గా గత ఏడాది బాధ్యతలు చేపట్టిన చెంగ్ లి-వున్.. షి జిన్పింగ్ ఆహ్వానంతో చైనాకు వెళ్లారు. తన పర్యటన ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పడానికి ఉపయోగపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనకు వస్తున్న వేళ.. జిన్పింగ్ తెలివిగా వ్యవహరించారు. సుమారు పదేళ్ల తర్వాత తైవాన్ ప్రతిపక్ష నాయకురాలికి ఆహ్వానం పంపారు. దీంతో కువోమింటాంగ్ (కేఎంటీ) చైర్పర్సన్ చెంగ్ లీ-వున్ ఆరు రోజుల పర్యటన నిమిత్తం చైనా వెళ్లారు. షాంఘై, నాన్జింగ్, బీజింగ్ నగరాల్లో పర్యటించే చెంగ్.. చైనా అధ్యక్షుడిని సైతం కలిసే అవకాశం ఉంది.
చెంగ్ పర్యటన సమయంలో.. తైవాన్ ప్రతిపక్షంతో స్నేహపూర్వక సమావేశాన్ని నిర్వహించాలని బీజింగ్ కోరుకుంటోంది. తద్వారా అమెరికా-తైవాన్ రక్షణ సహకారానికి మద్దతుగా వినిపించే వాదనలను బలహీనపర్చాలని చైనా భావిస్తోందని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ తైవాన్ సెంటర్లోని పొలిటికల్ సైంటిస్ట్ వెన్-టి సంగ్ తెలిపారు. ట్రంప్ బీజింగ్ పర్యటన సమయంలో అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడంపై డ్రాగన్ ఫోకస్ పెట్టడానికి వీలు ఉంటుందని సంగ్ వివరించారు.

