
ప్రముఖ వ్యాపారవేత్త ‘లెజెండ్’ శరవణన్ నటించిన తాజా చిత్రం ‘లీడర్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వివాదంలో చిక్కుకుంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి వీకెండ్లో కేవలం రూ. 3 నుండి 3.5 కోట్లు మాత్రమే వసూలు చేయగా, చిత్ర యూనిట్ మాత్రం ఏకంగా రూ. 25 కోట్లు సాధించినట్లు పోస్టర్ విడుదల చేయడం చర్చనీయాంశమైంది. అంతేకాకుండా రూ. 100 కోట్ల వైపు పరుగులు తీస్తోందని పేర్కొనడంతో నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్స్ వర్షం కురిపిస్తున్నారు.
తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేయాలని ఆరాటపడుతోన్న ప్రముఖ వ్యాపారవేత్త ‘లెజెండ్’ శరవణన్ దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తన మొదటి సినిమా ‘ది లెజెండ్’ ఆశించిన విజయం సాధించకపోయినా పట్టు వదలకుండా భారీ బడ్జెట్తో ‘లీడర్’ అనే స్పై యాక్షన్ థ్రిల్లర్ను రూపొందించారు. ఆర్ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 3న విడుదలైంది. అయితే, ఇప్పుడు ఈ సినిమా కంటెంట్ కంటే, మేకర్స్ విడుదల చేసిన వసూళ్ల పోస్టర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
కోలీవుడ్ మరియు టాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ‘లీడర్’ సినిమా మొదటి వీకెండ్లో ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 3 కోట్ల నుంచి రూ. 3.5 కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే సాధించింది. థియేటర్లలో ఆక్యుపెన్సీ చాలా తక్కువగా ఉండటం, టాక్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఈ లెక్కలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. కానీ చిత్ర యూనిట్ మాత్రం అందరినీ విస్మయానికి గురిచేస్తూ ఒక అధికారిక పోస్టర్ను విడుదల చేసింది. అందులో ఈ సినిమా వీకెండ్లోనే రూ. 25 కోట్లు వసూలు చేసిందని, అంతేకాకుండా రూ. 100 కోట్ల మార్క్ వైపు పరుగులు తీస్తోందని పేర్కొన్నారు. అసలు రూ. 3 కోట్లు రావడమే గగనంగా ఉన్న తరుణంలో, ఏకంగా రూ. 25 కోట్లు అని ప్రకటించడంపై సినీ విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు.

