
హైదరాబాద్ ఫ్యూచర్సిటీ మీదుగా నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు భూసేకరణ అంశంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. భూసేకరణ చట్టం-2013 నిబంధనలు పాటించలేదని, తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేదని కొందరు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన కోర్టు.. ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కాగా, రైతులకు పరిహారం చెల్లించే వరకు పిటిషనర్ల భూములను స్వాధీనం చేసుకోబోమని అడ్వకేట్ జనరల్ కోర్టుకు హామీ ఇచ్చారు. ఓఆర్ఆర్ కొంగరకలాన్ నుంచి మీర్ఖాన్ పేట్ మీదుగా ఆకుతోటపల్లి వరకు ఈ రోడ్డును ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్ ప్యూచర్ సిటీ మీదుగా ఔటర్ రింగు రోడ్డు నుంచి రీజినల్ రింగు రోడ్డు వరకు గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. ఓఆర్ఆర్ కొంగరకలాన్ నుంచి ఆమనగల్ మండలం ఆకుతోటపల్లి వద్ద రీజినల్ రింగు రోడ్డు వరకు ఈ ప్రాజెక్టును చేపట్టారు. అయితే ఈ కొత్త రహదారి నిర్మాణం చుట్టూ న్యాయవివాదాలు ముసురుకుంటున్నాయి. ప్రతిపాదిత గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు భూసేకరణ ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై సోమవారం (ఏప్రిల్ 6) తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. రోడ్డు నిర్మాణ ప్రక్రియలో నిబంధనలు ఉల్లంఘించారంటూ30 మంది రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. యాచారం మండలం కుర్మిద్ద, కడ్తాల్ మండలం కడ్తాల్, ముద్విన్, ఆమన్గల్ మండలం ఆకుతోటపల్లి గ్రామాల్లో మొత్తం 554.34 ఎకరాల సేకరణ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు. అయితే.. భూసేకరణ, పునరావాసం చట్టం-2013లో పేర్కొన్న తప్పనిసరి నిబంధనలను అధికారులు తుంగలో తొక్కారని వారు ఆరోపించారు. ముఖ్యంగా నిర్వాసిత రైతుల నుంచి అభ్యంతరాలను తీసుకోవాల్సి ఉండగా.. ఆ ప్రక్రియను మొక్కుబడిగా పూర్తి చేశారని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.

