
150 రోజుల్లో 16 వేల టీచర్ పోస్టుల భర్తీ చరిత్రాత్మకం
మంగళగిరి: డీఎస్సీపై వైసీపీ నేతలు మాట్లాడటం విడ్డూరంగా, హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ అంటే చంద్రబాబు నాయుడు గుర్తొస్తారని, ఆయన హయాంలో నిర్వహించిన డీఎస్సీల ద్వారా వేలాది మంది ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందారని సౌమ్య పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డీఎస్సీ ఫైలుపై తొలి సంతకం చేశారని తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు రికార్డు సమయంలో నియామకాలు పూర్తి చేశామని చెప్పారు.
డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన దాదాపు 150 రోజుల్లోనే 16 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం చరిత్రాత్మకమని తంగిరాల సౌమ్య అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో నియామక ప్రక్రియను పారదర్శకంగా, వేగంగా పూర్తి చేశామని పేర్కొన్నారు.
