
Rupee Surge: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో గత కొంతకాలంగా రూపాయి మారకం విలువ గణనీయంగా పడిపోతూ వచ్చింది. డాలరుతో పోలిస్తే ఇటీవల రూ. 94.85 వద్ద చరిత్రాత్మక కనిష్ఠాన్ని తాకిన రూపాయి.. ఆర్బీఐ జోక్యంతో మార్చి 30న ఒక్కసారిగా కోలుకుంది. సుమారు 130 పైసల మేర బలపడుతూ రూ. 93.59 వద్ద ప్రారంభమైంది. రూపాయిపై ఊహాగానాల్ని అరికట్టేందుకు ఆర్బీఐ కీలక చర్యలు చేపట్టింది.
Rupee to Dollar: అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితి కారణంగా భారతీయ రూపాయి గత కొంతకాలంగా అమెరికన్ డాలర్తో పోలిస్తే బలహీనంగా మారింది. రెండు రోజుల క్రితం ఇది రూ. 94.85 వద్ద ఆల్టైమ్ లో స్థాయిని తాకింది. అయితే సోమవారం (మార్చి 30) ట్రేడింగ్ సెషన్లో ఒక్కసారిగా మార్పు కనిపించింది. గత క్లోజింగ్తో పోలిస్తే సుమారు 130 పైసలు లేదా 1.3 శాతం పెరిగి రూ. 93.59 వద్ద ఓపెన్ కావడం గమనార్హం. తాజా ఆర్బీఐ చర్యలు రూపాయి స్థిరీకరణకు దోహదం చేస్తున్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
రూపాయి మరింత పడిపోకుండా ఉండేందుకు ఆర్బీఐ ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ట్రేడింగ్ ముగింపు సమయానికి ఆన్షోర్ మార్కెట్లో బ్యాంకులు 100 మిలియన్ డాలర్ల వరకే ఓపెన్ పొజిషన్లు ఉంచుకోవాలని కొత్త నిబంధనలు విధించింది. ఈ రూల్స్ ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నిర్ణయం వల్ల బ్యాంకులు అధికంగా డాలర్లను నిల్వ చేసుకునే అవకాశాలు తగ్గుతాయి. ఫలితంగా మార్కెట్లో డాలర్ సరఫరా పెరిగి రూపాయి విలువకు మద్దతు లభిస్తుంది.
ప్రారంభంలో బలపడిన రూపాయి.. అంతర్జాతీయ ఒడుదొడుకుల కారణంగా మళ్లీ కొంత ఒత్తిడికి లోనైంది. ప్రస్తుతం వార్త రాసే సమయానికి రూ. 94.30 వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య విధానాల్లో మార్పులు, మూలధన ప్రవాహాల్లో అనిశ్చితి, దేశీయ ఆర్థిక పరిస్థితులు రూపాయి మారకాన్ని ప్రభావితం చేస్తున్నాయి.
క్రూడ్ ఆయిల్ పెరుగుదలతో ఒత్తిడి..
గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడం రూపాయి బలహీనతకు ప్రధాన కారణంగా మారింది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చమురు ఉత్పత్తి, సరఫరాపై ప్రభావం పడుతోంది. యుద్ధానికి ముందు బ్యారెల్ ధర సుమారు 70 డాలర్ల వద్ద ఉండగా, ప్రస్తుతం అది 115 డాలర్లకు చేరుకుంది. భారత్ చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడటం వల్ల దిగుమతి ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ కొనుగోళ్లు డాలర్లలో జరుగుతుండటంతో డాలర్ డిమాండ్ పెరిగి రూపాయి విలువ తగ్గుతోంది.
ఇంకా ఇతర అంశాలు కూడా రూపాయి పతనానికి కారణమవుతున్నాయి. క్రూడ్ ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం పెరగడం, విదేశీ పెట్టుబడుల తగ్గుదల కూడా ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయంగా అనిశ్చితి పెరిగినప్పుడు పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతారు. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. విదేశీ మూలధనం తిరిగి రాకపోతే రూపాయి పై ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

