
మన్యం కాఫీకి అంతర్జాతీయంగా పేరున్న విషయం తెలిసిందే. కానీ రైతులకు సరైన ధర దక్కడం లేదని ఆందోళనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాఫీ కొనుగోలు ధరలను పెంచుతూ రైతులకు తీపి కబురు అందించింది మన్యం ఐటీడీఏ సంస్థ. ఈ మేరకు కాఫీ రకాన్ని బట్టి కిలోకి రూ. 10 నుంచి రూ. 50 మధ్యలో పెంచారు. అంతేకాకుండా ఇంటి వద్దే కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేశారు. ఇక కాఫీ సేకరించిన డబ్బులను రైతుల ఖాతాల్లో 24 గంటల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు
ఆంధ్రప్రదేశ్లోని మన్యం ప్రాంతంలో పండే కాఫీ.. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందింది. కాఫీ సాగుకు అనుకూలమైన చల్లని వాతావరణం ఉండటంతో.. మన్యం ప్రాంతంలో కాఫీ సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. అల్లూరి సీతారామ రాజు జిల్లా పాడేరు డివిజన్ పరిధిలో.. దాదాపు 1.50 లక్షల ఎకరాల్లో కాఫీ సాగవుతోందని గణాంకాలు చెబుతున్నాయి. ఇక్కడి కాఫీ రైతులు ఏటా సుమారు 17 వేల మెట్రిక్ టన్నుల కాఫీ గింజలను విక్రయిస్తారు. అయితే కాఫీ గింజల కొనుగోలులో రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పంటకు సరైన ధర రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాఫీ రైతులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది
