
ఏపీ కేబినెట్ సమావేశానికి ఆరుగురు మంత్రులు గైర్హాజరు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ఆరుగురు మంత్రులు హాజరుకాలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా నాదెండ్ల మనోహర్, వంగలపూడి అనిత, గొట్టిపాటి రవికుమార్, టీజీ భరత్, ఎన్.ఎం.డీ ఫరూక్ కేబినెట్ భేటీకి గైర్హాజరైనట్లు సమాచారం. వేర్వేరు వ్యక్తిగత కారణాల వల్ల సమావేశానికి రాలేకపోతున్నట్లు ఆయా మంత్రులు ముందుగానే అధికారులకు తెలియజేసినట్లు తెలిసింది. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల ఏర్పాట్లలో బిజీగా ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ సమావేశానికి హాజరు కాలేకపోయినట్లు సమాచారం.
మరోవైపు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా అదే కార్యక్రమాల నేపథ్యంలో సమావేశానికి రాలేకపోయారు. ఆరోగ్య సమస్యల కారణంగా మంత్రులు గొట్టిపాటి రవికుమార్, వంగలపూడి అనిత, టీజీ భరత్ కేబినెట్ సమావేశానికి దూరంగా ఉన్నట్లు సమాచారం. అలాగే కుటుంబ కారణాల వల్ల మంత్రి ఎన్.ఎం.డీ ఫరూక్ కూడా భేటీకి హాజరుకాలేకపోయినట్లు తెలిసింది.
జనసేన ఆవిర్భావ దినోత్సవం
మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, మండలాలు, నగరాలు, గ్రామ పంచాయతీల్లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మొదట ఈ వేడుకలను పిఠాపురంలో భారీ స్థాయిలో నిర్వహించాలని పార్టీ అధిష్టానం భావించింది. అయితే ప్రస్తుత ఎండలు, వేడిగాలుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరణతో పాటు జనసేన సిద్ధాంతాలను ప్రజలకు వివరించనున్నారు. అలాగే రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, మొక్కలు నాటడం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు సూచించారు.
సభ్యత్వ నమోదు గడువు పొడిగింపు
ఇదిలా ఉండగా జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమం గడువు మొదట మార్చి 10తో ముగియాల్సి ఉండగా, కార్యకర్తలు మరియు ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు దాన్ని మార్చి 17 వరకు పొడిగించినట్లు పార్టీ ప్రకటించింది. ఫిబ్రవరి 26న ప్రారంభమైన ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా మంచి స్పందన పొందుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

