
అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వంగలపూడి అనిత పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసు బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం, పోలీసుల గౌరవ వందనం స్వీకరించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. అనకాపల్లి కేవలం ఒక జిల్లా మాత్రమే కాదని, అనేక పోరాటాలకు, ఉద్యమాలకు సాక్ష్యంగా నిలిచిన నేల అని పేర్కొన్నారు.
అల్లూరి సీతారామరాజు విప్లవ స్ఫూర్తి, గురజాడ అప్పారావు సామాజిక చైతన్యం అనకాపల్లి ప్రాంత ప్రత్యేకతను ప్రతిబింబిస్తాయని మంత్రి తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు.
స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యం
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల స్ఫూర్తితో వారు కలలుగన్న సుసంపన్నమైన, శాంతియుత భారతదేశాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుని కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు. రాష్ట్ర ప్రగతిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని మంత్రి ఆకాంక్షించారు.

