
వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్టణానికి భవిష్యత్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. గోదావరి జలాలను నగరానికి తరలించేందుకు సుమారు రూ.1,000 కోట్లతో ప్రాజెక్టుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే టెండర్ ప్రక్రియను ప్రారంభించింది.
పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. గోదావరి జలాలను విశాఖకు తరలించడంతో పాటు నీటి సరఫరా వ్యవస్థను బలోపేతం చేయనున్నారు. అలాగే మురుగునీటిని శుద్ధి చేసి పరిశ్రమలకు అందించేందుకు మరో రూ.1,500 కోట్లతో ఎస్టీపీల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ప్రస్తుతం జీవీఎంసీ పరిధిలో సుమారు 24 లక్షల మంది జనాభా ఉంది. ప్రమాణాల ప్రకారం రోజుకు 320 ఎంఎల్డీ నీరు అవసరం కాగా.. అందుబాటులో ఉన్న వనరుల ద్వారా సుమారు 180 ఎంఎల్డీ మాత్రమే సరఫరా చేయగలుగుతున్నారు. ఏలేశ్వరం, తాటిపూడి, రైవాడ రిజర్వాయర్లతో పాటు గోదావరి నుంచి నీటిని సేకరిస్తున్నారు.
ఈ సమస్యకు పరిష్కారంగా పోలవరం ఎడమకాలువ ద్వారా గోదావరి నీటిని కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు తరలించనున్నారు. అక్కడి నుంచి మేహాద్రిగెడ్డ రిజర్వాయర్కు, అనంతరం ముడసర్లోవలోని కొత్త ట్రీట్మెంట్ ప్లాంట్కు నీటిని తీసుకెళ్లి మధురవాడ ప్రాంతానికి సరఫరా చేయనున్నారు.
మధురవాడ తాగునీటి నెట్వర్క్ కోసం ఇప్పటికే రూ.570 కోట్లతో టెండర్లు పిలిచారు. మరో రూ.110 కోట్లతో స్కాడా వ్యవస్థ ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానించనున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే విశాఖకు దీర్ఘకాలిక తాగునీటి భరోసా లభించనుంది.

