
ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రూ.86 కోట్లతో 25 వసతిగృహాలను నిర్మిస్తున్నారు. వీటిలో ఒకటి కోర్టు కేసు కారణంగా నిలిచిపోగా.. మిగిలిన భవనాల పనులు కొనసాగుతున్నాయి. 18 హాస్టళ్లను సెప్టెంబర్ నెలాఖరు నాటికి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
గతంలో ప్రభుత్వ హాస్టళ్లలో సరైన వసతులు, నాణ్యమైన ఆహారం లేక విద్యార్థులు ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం.. హాస్టళ్లలో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తోంది. ముఖ్యంగా ఎస్సీ వసతిగృహాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది.
పీఎం అజయ్ పథకం కింద రాష్ట్రానికి రూ.86 కోట్ల నిధులు మంజూరయ్యాయి. తొలి విడతలో 25 హాస్టళ్లను గుర్తించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా నిధులు విడుదలయ్యాయి. ఒక్కో భవనానికి రూ.3 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు.
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా విశాలమైన స్టడీ రూములు, డైనింగ్ హాళ్లు, వంటగదులు, స్నానపు గదులు, మరుగుదొడ్లు వంటి సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఆరు హాస్టళ్ల నిర్మాణ పనులు పూర్తై ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. గజపతినగరం, రాయదుర్గం, పామర్రు, ప్రొద్దుటూరు, కలసపాడు, నందికొట్కూరులో ఇవి అందుబాటులోకి రానున్నాయి.
100 మంది విద్యార్థుల సామర్థ్యంతో నిర్మించే హాస్టల్ భవనానికి సుమారు రూ.3 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇందులో ఏడు విశాలమైన గదులు, డైనింగ్ హాల్, 16 స్నానపు గదులు, 12 మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నారు.
కొత్త భవనాలు అందుబాటులోకి వస్తే విద్యార్థులకు సౌకర్యవంతమైన వాతావరణంలో చదువుకునే అవకాశం లభించనుంది. దీంతో ప్రభుత్వ హాస్టళ్లపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నమ్మకం మరింత పెరగనుంది.

