
హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ అధికారులు భారీ శుభవార్త చెప్పారు. ఆస్తి పన్ను చెల్లింపులకు సంబంధించి కీలక ప్రకటన వెలువరించారు. ఈనెల 31 లోపు ఆస్తి పన్ను చెల్లించే వారికి.. ఆస్తి పన్నుపై ఉన్న వడ్డీలో 90 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆన్లైన్లో ఆస్తి పన్ను బకాయిలను చెల్లించాలని సూచించారు. గడువు దాటిన తర్వాత పూర్తి వడ్డీని వసూలు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
నగర పరిధిలో ఉన్న ఆస్తులకు సంబంధించిన పన్ను చెల్లింపుల బకాయిలు పేరుకుపోవడంతో.. వాటిని వసూలు చేసే పనిలో పడింది. ఈ నేపథ్యంలోనే ఈ 2025-26 ఆర్థిక సంవత్సరం ముగియనుండగా.. ఆలోగా వీలైనంత ఎక్కువ పెండింగ్ బకాయిలను వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే నగరవాసులకు భారీ ఉపశమనం కల్పించే వార్తను చెప్పింది. పెండింగ్ ఆస్తి పన్ను బకాయిల చెల్లింపునకు వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) పథకాన్ని అమలు చేస్తోంది.
గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న ఆస్తి పన్ను బకాయిలను ఈనెల 31వ తేదీలోపు చెల్లిస్తే.. దానిపై ఉన్న వడ్డీలో 90 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఇక జీహెచ్ఎంసీ ఆఫీసులకు నగరవాసులు వచ్చి పన్ను చెల్లించే అవసరం లేకుండా సులభంగా ఇంటి దగ్గరే ఉండి కూడా బకాయిలు చెల్లించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు పలు అవకాశాలను అందుబాటులోకి తీసుకువచ్చారు.

