
పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధాన్ని ఆపేందుకు పాకిస్థాన్ రంగంలోకి దిగింది. అగ్రరాజ్యం అమెరికా, ఇస్లామిక్ రిపబ్లిక్ ఇరాన్ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇస్లామాబాద్ను శాంతి వేదికగా మార్చేందుకు పాక్ పావులు కదుపుతోంది. అటు డొనాల్డ్ ట్రంప్తో ఉన్న సాన్నిహిత్యాన్ని, ఇటు ఇరాన్ సుప్రీం లీడర్లతో ఉన్న చారిత్రాత్మక సంబంధాలను వాడుకుంటూ.. పాక్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్ అత్యంత రహస్యంగా దౌత్య చర్చలను కొనసాగిస్తున్నారు. మరి వీరి మధ్యవర్తిత్వం మధ్య యుద్ధం ఆగతుందా లేదా అనేది చూడాలి.
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధాన్ని ఆపేందుకు పాకిస్థాన్ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తోనూ, అటు ఇరాన్ అగ్రనేతలతోనూ సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో.. ఇరు దేశాల మధ్య మధ్యవర్తిగా వ్యవహరించేందుకు ఇస్లామాబాద్ సిద్ధం అయింది. ముఖ్యంగా అమెరికా ప్రతినిధి బృందం, ఇరాన్ ఉన్నతాధికారుల మధ్య ఈ వారంలోనే ఇస్లామాబాద్ వేదికగా కీలక చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇందుకోసం ఇప్పటికే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఇరు దేశాధినేతలతో చర్చించినట్లు తెలుస్తోంది.
ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం.. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్తో ఫోన్లో మాట్లాడగా.. ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్తో చర్చలు జరిపారు. ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడం వెనుక పాకిస్థాన్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఇరాన్ కూడా ఈ విషయాన్ని పరోక్షంగా ధృవీకరించింది. “కొన్ని మిత్ర దేశాల ద్వారా అమెరికా నుంచి చర్చల ప్రతిపాదనలు అందాయి. వాటికి మా ప్రాథమిక సిద్ధాంతాలకు అనుగుణంగా సమాధానం ఇచ్చాం” అని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బాకాయీ పేర్కొన్నారు.

