
నందమూరి బాలకృష్ణ తన 50 ఏళ్ల సినీ ప్రస్థానానికి గుర్తింపుగా ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ దిల్లీ’ (IFFD 2026)లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. దిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఈ వేడుకలో ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆయనను ఘనంగా సత్కరించారు. తండ్రి ఎన్టీఆర్ వారసత్వాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న బాలయ్యకు ఈ గౌరవం దక్కడంపై నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన గౌరవం దక్కింది. గత ఐదు దశాబ్దాలుగా భారతీయ సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన ఆయనకు ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ దిల్లీ’ వేడుకల్లో లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రధానం చేశారు. దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా చేతుల మీదుగా బాలయ్యకు ఈ పురష్కారం అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ దిల్లీ’ (IFFD 2026) వేడుకలు బుధవారం సాయంత్రం దేశ రాజధానిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. దిల్లీ పర్యాటక, రవాణా అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక ఉత్సవాలకు ‘భారత్ మండపం’ వేదికైంది. మార్చి 31 వరకు కొనసాగనున్న ఈ చలనచిత్ర ఉత్సవాల్లో వివిధ భాషా చిత్రాలను ప్రదర్శించనున్నారు. సీఎం రేఖా గుప్తాతో పాటు మంత్రులు కపిల్ మిశ్రా, పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ, నటీమణులు హేమ మాలిని, కంగనా రనౌత్, షర్మిలా ఠాగూర్లు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ఉత్సవాలను ప్రారంభించారు. బాలయ్యతో పాటుగా అలనాటి నటి షర్మిలా ఠాగూర్, దివంగత లెజెండరీ నటుడు ధర్మేంద్రలను కూడా జీవితకాల సాఫల్య పురష్కారాలతో గౌరవించారు.

