
సైబర్ నేరాల నుంచి ప్రజలను కాపాడడంలో బ్యాంక్ ఉద్యోగులు పాత్ర కీలకమని, బ్యాంకర్లు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ సూచించారు. డిజిటల్ అరెస్టులు, పెట్టుబడి మోసాల బారిన పడిన బాధితులు ఆందోళనతో డబ్బు విత్డ్రా చేస్తున్నప్పుడు బ్యాంకర్లు వారిని గమనించి ఆరా తీయాలన్నారు. ముఖ్యంగా వృద్ధుల సొమ్మును కాపాడాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందని.. అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీపీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా కోరారు.
సైబర్ నేరాల నుంచి సామాన్య ప్రజలను కాపాడడంలో బ్యాంకు ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమైనదని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. ప్రజల సొమ్ముకు కాపలాదారులుగా ఉన్న బ్యాంకర్లు తమ కస్టమర్ల పట్ల మరింత బాధ్యతగా వ్యవహరిస్తూ.. వారు ఏదైనా మోసానికి గురవుతున్నట్లు గమనిస్తే వెంటనే అప్రమత్తం చేయాలని సూచించారు. ముఖ్యంగా డిజిటల్ అరెస్టులు, పెట్టుబడి మోసాల బారిన పడినప్పుడు కస్టమర్లు తమ డిపాజిట్లను హుటాహుటిన విత్డ్రా చేయడం లేదా బంగారంపై అప్పులు తీసుకోవడం వంటివి చేస్తుంటారని గర్తు చేశారు. అటువంటి సమయాల్లో వారి ప్రవర్తనలో ఏవైనా అసాధారణ మార్పులు, ఆందోళన కనిపిస్తే అది సైబర్ ముఠాల పనేమోనని అనుమానించి ఆరా తీయాలని సూచించారు.
ముఖ్యంగా వృద్ధులు, పెన్షనర్లు తమ జీవితకాలపు సంపాదనను మోసగాళ్ల మాయలో పడి పోగొట్టుకోకుండా చూడాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందని అన్నారు. ఒకవేళ ఏవైనా అనుమానాస్పద లావాదేవీలు గమనిస్తే వెంటనే పోలీసులకు లేదా 1930 నంబర్కు, డయల్ 100కి సమాచారం అందించాలన్నారు. ప్రజలు కూడా పోలీసుల హెచ్చరికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. బ్యాంకర్లు, పోలీసులు, ప్రజలు సమన్వయంతో చైతన్యవంతులైతేనే సైబర్ నేర రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని సజ్జనార్ ట్వీట్ చేశారు.

