
హైదరాబాద్ దక్షిణ భాగంలో నిర్మిస్తున్న రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు-1 పనులు వేగంగా సాగుతున్నాయి. రూ.4,621 కోట్లతో రెండు దశల్లో నిర్మిస్తున్న ఈ 41.5 కిలోమీటర్ల రహదారి ఓఆర్ఆర్ను ప్రతిపాదిత ఆర్ఆర్ఆర్తో అనుసంధానించనుంది. 100 మీటర్ల వెడల్పుతో ఆరు లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ కారిడార్గా రూపొందుతున్న ఈ ప్రాజెక్టులో భవిష్యత్తు మెట్రో, ఎంఎంటీఎస్ కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి, రవాణా సౌలభ్యానికి ఇది కీలకంగా మారనుందని అధికారులు చెబుతున్నారు.
హైదరాబాద్ నగర దక్షిణ సరిహద్దులో రవాణా వ్యవస్థను ఆధునికీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు-1 ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీకి ఈ రహదారి కీలక అనుసంధాన మార్గంగా నిలవనుంది. నగర విస్తరణతో పాటు భవిష్యత్ పారిశ్రామిక, ఐటీ, నివాస ప్రాంతాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టును అత్యాధునిక ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. రైతులు స్వచ్ఛందంగా భూములు అందించడం వల్ల భూసేకరణ ప్రక్రియ వేగవంతమై.. నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
ఈ ప్రాజెక్టును మొత్తం రూ.4,621 కోట్ల వ్యయంతో రెండు దశల్లో నిర్మిస్తున్నారు. ఓఆర్ఆర్ ఎగ్జిట్-13 రావిర్యాల ఇంటర్చేంజ్ నుంచి ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డులోని ఆమనగల్లు వరకు మొత్తం 41.5 కిలోమీటర్ల పొడవున ఈ గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణం జరుగుతోంది. 100 మీటర్ల వెడల్పుతో ఆరు లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ కారిడార్గా దీనిని అభివృద్ధి చేస్తున్నారు. భవిష్యత్తులో రవాణా అవసరాలు పెరిగితే ఎనిమిది లేన్ల వరకు విస్తరించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రాజెక్టులో మరో ప్రత్యేకత ఏమిటంటే.. రహదారి మధ్యలో 20 మీటర్ల విస్తీర్ణాన్ని మెట్రో రైలు లేదా ఎంఎంటీఎస్ కారిడార్ అభివృద్ధికి ముందుగానే కేటాయించడం. దీంతో భవిష్యత్తులో ప్రజారవాణా వ్యవస్థను ఈ మార్గంతో అనుసంధానం చేసే అవకాశం ఉంటుంది. రహదారి వెంట సర్వీస్ రోడ్లు, ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ, వర్షపు నీటి పారుదల సదుపాయాలు, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా రూపకల్పన చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే దక్షిణ హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గడంతో పాటు ప్రయాణ సమయం కూడా తగ్గనుంది.
నిర్మాణ పనులను రెండు దశల్లో చేపట్టారు. మొదటి దశలో రావిర్యాల నుంచి మీర్ఖాన్పేట వరకు 19.2 కిలోమీటర్ల రహదారిని రిత్విక్ ప్రాజెక్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. రెండో దశలో మీర్ఖాన్పేట నుంచి ఆమనగల్లు వరకు 22.3 కిలోమీటర్ల రహదారి నిర్మాణ బాధ్యతను ఎల్ అండ్ టీ సంస్థ చేపట్టింది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో భూమిని చదును చేయడం, కొండలను తొలగించి రహదారికి అనువుగా మార్చడం, మట్టిపనులు, ఎంబాంక్మెంట్ నిర్మాణం వేగంగా సాగుతున్నాయి. అవసరమైన చోట్ల అండర్పాస్లు, చిన్న వంతెనలు, కల్వర్టుల నిర్మాణ పనులు కూడా పురోగతిలో ఉన్నాయి.

