
ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ షాపులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈసారి టిడ్కో ఇళ్లలో నివాసం ఉండే వారి కోసం వీటిని ఏర్పాటు చేయనుంది. మొత్తం 117 చోట్ల తొలి విడతగా రేషన్ షాపుల్ని ఏర్పాటు చేయబోతోంది. టిడ్కో ఇళ్లలో నివాసం ఉంటున్నవారు ఇబ్బందిపడుతున్నారని గమనించి ప్రభుత్వం.. ఈ మేరకు కొత్త రేషన్ షాపులు ఏర్పాటుకు సిద్ధమైంది.
ఆంధ్రప్రదేశ్లో టిడ్కో గృహ సముదాయాల్లో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించారు.. ఈ టిడ్కో హౌసింగ్ కాంప్లెక్స్లు నగరాలు, పట్టణాలకు శివారు ప్రాంతాల్లో ఉన్నాయి. దీంతో టిడ్కో ఇళ్లలో నివాసం ఉండే కుటుంబాలకు రేషన్ షాపులు దూరంగా ఉన్నాయి. వీరు ప్రతి నెలా రేషన్ తెచ్చుకోవాలంటే గతంలో నివాసం ఉన్న ప్రాంతాలకు వెళ్లా్ల్సి వస్తోంది. చాలామంది తాము నివాసం ఉంటున్న టిడ్కో ఇళ్ల నుంచి 4 నుంచి 8 కిలోమీటర్లు వరకు ప్రయాణించాల్సి వస్తోంది. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా టిడ్కో హౌసింగ్ క్లాంపెక్స్ల దగ్గర కొత్తగా మరికొన్ని రేషన్ షాపుల్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఏపీ ప్రభుత్వం టిడ్కో గృహ సముదాయాల దగ్గరే రేషన్ షాపులు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 163 చోట్ల టిడ్కో గృహ సముదాయాల్ని నిర్మిస్తుండగా.. ఒక్కోచోట దాదాపు 500 కుటుంబాల నుంచి 10 వేల మంది వరకు ఉండేలా ప్లాన్ చేశారు. ఈ 163లో 70 గృహ సముదాయాలలో ప్రభుత్వం ఇప్పటికే లబ్ధిదారులకు స్వాధీనం చేసింది. మరో 40 చోట్ల పనులు పాక్షికంగా పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగించింది.. ఈ నెలాఖరుకు మరో ఏడు చోట్ల లబ్ధిదారులకు అప్పగించనుంది. ఏపీ ప్రభుత్వం వీటిలో 117 చోట్ల తొలి విడతగా కొత్త రేషన్ షాపుల్ని ఏర్పాటు చేయనుంది.
ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ ప్రస్తుతం 500-1000 కుటుంబాలకు సగటున ఒక రేషన్ షాపును ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం టిడ్కో గృహ సముదాయాల్లో లబ్ధిదారులు ఉంటున్న చోట్ల ఎన్ని రేషన్ షాపులు అవసరమవుతాయోనని నివేదిక పంపాలని కోరింది. పౌరసరఫరాల శాఖకు రెండు, మూడు రోజుల్లో ఆ నివేదికను అందజేయనున్నారు. ఆ వెంటనే కొత్త రేషన్ షాపుల ఏర్పాటుకు చర్యలు చేపడతారు. ఈ 117 చోట్ల కాకుండా మిగతా చోట్ల రెండో విడతలో రేషన్ షాపులు అందుబాటులోకి తీసుకురానున్నారు. మొత్తం మీద టిడ్కో లబ్ధిదారుల సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

