
ఏపీ రాజధాని అమరావతిలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాయపూడి పరేడ్ గ్రౌండ్స్లో తొలిసారిగా జరిగిన వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
జాతీయ జెండా స్వాతంత్ర్యానికి ప్రతీక మాత్రమే కాకుండా ఆత్మగౌరవానికి, ఐక్యతకు చిహ్నమని చంద్రబాబు అన్నారు. ఎన్నో దశాబ్దాల పోరాటం, అనేక తరాల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. దేశ, రాష్ట్ర భవిష్యత్తును గొప్పగా నిర్మించడమే స్వాతంత్ర్య సమరయోధులకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
ప్రతి పౌరుడు ‘నా దేశం.. నా బాధ్యత’ అనే భావనతో ముందుకు సాగాలని సీఎం పిలుపునిచ్చారు. దేశం తనకు ఏం చేసిందనే దానికంటే.. దేశానికి తాను ఏం చేయగలననే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండాలన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
అభివృద్ధి వైపు ఏపీ అడుగులు
రాష్ట్రం ఎన్నో సవాళ్లు, సంక్షోభాలను ఎదుర్కొందని చంద్రబాబు అన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు కూటమికి అద్భుత విజయాన్ని అందించారని, ప్రస్తుతం రాష్ట్రం విధ్వంసం నుంచి వికాసం వైపు పయనిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీకి కొత్త ఊపిరి వచ్చిందని పేర్కొన్నారు.
స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంగా 10 సూత్రాలతో పాలన సాగిస్తున్నామని సీఎం తెలిపారు. ప్రతి గ్రామం, ప్రతి జిల్లాను అభివృద్ధి చేసేలా కార్యాచరణ రూపొందించామని చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ప్రాంతాలను ఎకనామిక్ రీజియన్లుగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
2047 నాటికి రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు వచ్చే 20 ఏళ్లు కష్టపడి పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

