
విజయవాడలో గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ‘ఈగల్ ఛాలెంజ్’కు శ్రీకారం చుట్టింది. గంజాయి రవాణా, విక్రయాలపై కచ్చితమైన సమాచారం అందించి నిందితులను పట్టించడంలో సహకరిస్తే రూ.5 వేల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు పోలీసులు ప్రకటించారు. గంజాయి వినియోగిస్తున్న వారిపై సమాచారం అందించిన వారికి రూ.1,500 బహుమతి అందించనున్నారు.
సమాచారం ఇచ్చే వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని విజయవాడ సీపీ ఎస్.వి. రాజశేఖరబాబు తెలిపారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా గంజాయి, డ్రగ్స్కు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు అందించాలని కోరారు.
విజయవాడ అజిత్సింగ్నగర్లోని సెయింట్ ఆన్స్ పాఠశాలలో సీపీ రాజశేఖరబాబు, ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ ‘ఈగల్ ఛాలెంజ్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గంజాయి రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న 32 మందిపై పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద చర్యలు తీసుకున్నట్లు సీపీ వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ నిర్మూలన కోసం 40 వేల విద్యాసంస్థల్లో ‘డ్రగ్స్ వద్దు బ్రో’ పేరుతో ఈగల్ క్లబ్లను ఏర్పాటు చేసినట్లు ఐజీ ఆకే రవికృష్ణ తెలిపారు. గంజాయి, డ్రగ్స్ హాట్స్పాట్లుగా 849 ప్రాంతాలను గుర్తించినట్లు చెప్పారు. ఈగల్ కాల్సెంటర్ 1972కు ప్రజల నుంచి, ముఖ్యంగా తల్లుల నుంచి గంజాయికి సంబంధించిన సమాచారం వస్తోందని వెల్లడించారు.
ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల 1,287 మంది గంజాయి కేసులతో సంబంధం ఉన్నవారిని ప్రశ్నించారు. వారిలో పరీక్షలు నిర్వహించగా 1,000 మందికి పైగా నెగెటివ్గా తేలారు. అజిత్సింగ్నగర్ పరిధిలో 469 మందికి పరీక్షలు నిర్వహించగా 128 మందికి గంజాయి వినియోగించినట్లు పాజిటివ్గా నిర్ధారణ అయింది.
విజయవాడలో డ్రగ్స్, గంజాయి, ‘బ్లేడ్ బ్యాచ్’ సంస్కృతికి పూర్తిగా చెక్ పెట్టడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గతంలో ‘డ్రగ్స్పై దండయాత్ర 1.0’, ‘డ్రగ్స్పై దండయాత్ర 2.0’, ‘మార్పుకు మరో అవకాశం’ వంటి కార్యక్రమాలు నిర్వహించిన పోలీసులు.. ఇప్పుడు ప్రజల భాగస్వామ్యంతో ‘ఈగల్ ఛాలెంజ్’ను మరింత విస్తృతం చేస్తున్నారు.
గంజాయి లేదా డ్రగ్స్కు సంబంధించిన సమాచారం ఉంటే డయల్ 112 / 1972కు కాల్ చేయాలని, లేదా వాట్సాప్ 7328909090కు సమాచారం పంపాలని పోలీసులు సూచించారు. సమీప పోలీస్స్టేషన్ లేదా సంబంధిత పోలీసు అధికారులను కూడా సంప్రదించవచ్చని తెలిపారు.

